న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరో్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్తో కలసి రాహుల్ కీలక పరుగులు చేస్తుండటం టీమిండియాకు శుభపరిణామంగా చెప్పొచ్చు. ముఖ్యంగా టీమిండియాకు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో శిఖర్ ధావన్-రోహిత్ శర్మ తర్వాత ఈ ఇద్దరి రూపంలో మరో ఓపెనింగ్ జోడీ దొరికినట్లేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ 398 రన్స్ చేయగా, రాహుల్ 540 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ గురించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘మయాంక్, రాహుల్ బ్యాటింగ్ అద్భుతం. ఇది టీమిండియా క్రికెట్ బలాన్ని నిరూపిస్తోంది. ఒక్కోసారి ఇది యంగ్ క్రికెటర్స్కు హానికరం కూడా కావొచ్చు. రోహిత్ శర్మను చూసుకుంటే.. అతడు టీమ్లో కుదురుకోవడానికి చాలా టైమ్ పట్టింది. టెస్టు ప్లేయర్ను మాత్రమే కాదని అంత కంటే ఇంకెక్కువే ఆడగలనని మయాంక్ తన స్థాయిని నిరూపించుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ నిలకడను మెచ్చుకోకుండా ఉండలేం. అతడో మల్టీ డైమెన్షనల్ ప్లేయర్. ఓ క్రికెటర్గా ఎలాంటి పరిస్థితులనైనా అలవర్చుకోవాలి. అలా ముందుకెళ్లే వాళ్లే విజయవంతం అవుతారు’ అని రోడ్స్ చెప్పాడు.