రాజకీయాలను భ్రష్టుపట్టించిన కేసీఆర్  : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ 

రాజకీయాలను భ్రష్టుపట్టించిన కేసీఆర్  : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ 

నిజామాబాద్, వెలుగు: పదేండ్ల అధికారంలో ఎగిరెగిరిపడ్డ బీఆర్​ఎస్​ ఇప్పుడు కనబడ్తలేదని తన పార్లమెంట్​సెగ్మెంట్​లో చాలా తగ్గిపోయిందని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ధర్మపురి అన్నారు. శుక్రవారం మున్సిపల్​ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అసెంబ్లీ బడ్జెట్, వర్షాకాలం, చలికాలం సమావేశాలు రెండు నెలల పాటు జరిగేవని కేసీఆర్​ వచ్చాక వాటిని గణనీయంగా కుదించారన్నారు.

తనను ప్రశ్నించేవారుండొద్దని అసెంబ్లీ మీటింగ్​లకు ప్రయారిటీ ఇచ్చేవారుకాదన్నారు. అడ్డగోలు రాజకీయాలతో కేసీఆర్​ అంతా నాశనం చేయగా సీఎం రేవంత్​రెడ్డి వారి బాటలో నడుస్తూ  ప్రజాస్వామ్యాన్ని అధ:పాతాళానికి తొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లింలను పక్కన పెట్టుకొని మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్​కు వారులేకుంటే జీరో అవుతామనే భయం ఉందన్నారు. బీజేపీ హుందా రాజకీయాలు చేస్తుందన్నారు.

మున్సిపల్​ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచిన సెగ్మెంట్​గా నిజామాబాద్​ను నిలబెట్టామన్నారు. ఇందూర్​ కార్పొరేషన్​లోని 60 డివిజన్​ల్లో 28 స్థానాలు గెలిచి నంబర్​ వన్​ అయ్యామన్నారు. మేయర్​ సీటు రాలేదనే బాధలేదు. యుద్ధం గెలిచామన్న సంతోషం ఉంది. భవిష్యత్​ రాజకీయాలు బీజేపీవేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటుతామన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, నేషనల్​ టర్మరిక్​ బోర్డ్​ చైర్మన్​ పల్లెగంగారెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్​ దినేశ్, కాంతారావు, మల్లికార్జునరెడ్డి, మేడపాటి ప్రకాశ్​రెడ్డి, మోహన్​రెడ్డి ఉన్నారు.