న్యూఢిల్లీ: పది టీమ్స్తో ఈ ఏడాది నుంచి క్రికెట్ ఫ్యాన్స్కు మరింత కిక్ ఇచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ హీట్ ఇప్పుడే మొదలైంది. లీగ్ స్టార్టింగ్ డేట్స్, ఎక్కడ నిర్వహించాలనేదానిపై, ఫ్రాంచైజీ ఓనర్స్, బీసీసీఐ పెద్దలు ఓ ఐడియాకు వచ్చారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువైనప్పటికీ ఈ సీజన్ను ఇండియాలోనే కండక్ట్ చేయాలని పది ఫ్రాంచైజీ ఓనర్లు కోరుకుంటున్నారని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పారు. మార్చి లాస్ట్ వీక్లో స్టార్ట్ చేసి మేలో సీజన్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఐపీఎల్ ఓనర్లతో శనివారం జరిగిన మీటింగ్లో పాల్గొన్న షా ప్రకటించారు. ఈ లెక్కన మార్చి 27వ తేదీన ఐపీఎల్15 మొదలయ్యేలా ఉంది. అదే టైమ్లో ఏప్రిల్ 2వ తేదీని కూడా బోర్డు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘కొంత మంది ఓనర్లు మార్చి 27నే ప్రిఫర్ చేశారు. కానీ, శ్రీలంకతో లాస్ట్ టీ20 లక్నోలో మార్చి 18న ముగుస్తుంది. లోథా రూల్ ప్రకారం ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచ్కు.. ఐపీఎల్ స్టార్టింగ్కు మధ్య 14 రోజుల గ్యాప్ ఉండాలి. అప్పుడు ఏప్రిల్ 2వ తేదీనే లీగ్ స్టార్ట్ అవ్వొచ్చు’ అని బోర్డు వర్గాలు చెప్పాయి.
ప్లాన్‑బి కూడా
ఈ సీజన్ను ఇండియాలోనే నిర్వహించడం బోర్డు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని జై షా స్పష్టం చేశారు. అదే టైమ్లో హెల్త్, సేఫ్టీ విషయంలో బీసీసీఐ రాజీపడబోదన్నారు. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ ప్లాన్–-బిపై వర్కౌట్ చేస్తామన్నారు. వచ్చే నెల 13,14న జరిగే మెగా ఆక్షన్లోపే వేదికలను ఖరారు చేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో గతంలో మాదిరిగా పలు సిటీల్లో కాకుండా ఈ సీజన్ను ముంబై, పుణెలోనే నిర్వహించాలని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. ముంబైలో మూడు స్టేడియాలు (వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్) ఉన్నాయి. పుణెలోని ఎంసీఏ స్టేడియం సిటీలో కాకుండా హైవేకు దగ్గర్లోనే ఉండటంతో బయో బబుల్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుందని భావిస్తున్నాయి. ఫైనల్ను వరల్డ్ లార్జెస్ట్ అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇక, ప్లాన్–బిలో భాగంగా ఇప్పటికే మూడు సీజన్లు జరిగిన యూఏఈని, 2009 సీజన్కు ఆతిథ్యం ఇచ్చిన సౌతాఫ్రికాను బ్యాకప్ వెన్యూగా చూస్తున్నారు. అయితే, ఇండియాలో పరిస్థితి పూర్తిగా చేయి దాటితేనే యూఏఈ లేదా సౌతాఫ్రికా తెరపైకి వచ్చే చాన్సుంది. శ్రీలంక పేరు కూడా వినిపించినా.. మీటింగ్లో చర్చించలేదు.
టాప్ డ్రాలో శ్రేయస్, వార్నర్..ప్లేయర్ ఆక్షన్కు 1,214 మంది రిజిస్టర్
కొత్త సీజన్ ప్లేయర్ ఆక్షన్ కోసం ఇండియాతో పాటు 18 దేశాల నుంచి ఏకంగా 1,214 మంది ప్లేయర్లు బరిలో నిలిచారు. ఈనెల 20నే ప్లేయర్ రిజిస్ట్రేషన్ డెడ్లైన్ ముగియగా.. 896 మంది ఇండియన్స్, 318 మంది ఫారిన్ ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఇందులో 270 మంది క్యాప్డ్, 903 మంది అన్క్యాప్డ్, 41 మంది అసోసియేట్ దేశాల ప్లేయర్లు ఉన్నారని తెలిపింది. ఆస్ట్రేలియా డ్యాషింగ్ క్రికెటర్, టీ20 వరల్డ్కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన డేవిడ్ వార్నర్తో పాటు ఇండియా స్టార్స్ శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్.. యంగ్స్టర్స్ దేవదత్ పడిక్కల్, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్తో ఆక్షన్లోకి రానున్నారు. మొత్తంగా 49 మంది ప్లేయర్లు తమ బేస్ప్రైజ్ను రెండు కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇందులో 17 మంది ఇండియన్స్ కాగా... వార్నర్, రబాడ, డ్వేన్ బ్రావో, కూల్టర్నైల్ తదితర ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. బెంగళూరులో జరిగే ప్లేయర్ ఆక్షన్లో టాప్ డ్రాలోని క్రికెటర్ల కోసం పది ఫ్రాంచైజీలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడనున్నాయి. స్టార్ ప్లేయర్స్తో పాటు గత ఐపీఎల్లో సత్తా చాటిన వాళ్లు రూ. 7 నుంచి15 కోట్ల వరకూ పలికే చాన్సుంది. వార్నర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయమే.
బరిలో భూటాన్ ప్లేయర్.. స్టోక్స్, స్టార్క్, గేల్ ఔట్
ఈ సీజన్ ఆక్షన్ కోసం 200 ప్లస్ క్యాప్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్లు బరిలో ఉండగా.. 62 మంది అన్క్యాప్డ్ ఫారిన్ ప్లేయర్లు సైతం రేసులో నిలిచారు. ఇండియా తర్వాత ఎక్కువగా ఆస్ట్రేలియా నుంచి 59 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. సౌతాఫ్రికా (48), వెస్టిండీస్ (41), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29) నుంచి కూడా ఎక్కువ మంది రేసులో నిలిచారు. ఐసీసీ అసోసియేట్ నేషన్స్లో తొలిసారి భూటాన్ నుంచి ఓ ప్లేయర్ ఆక్షన్కు రానుండగా.. నేపాల్ నుంచి 15 మంది, యూఎస్ఏ నుంచి 14 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అయితే, పలువురు ఇంటర్నేషనల్ స్టార్స్ ఈ సీజన్కు దూరమయ్యారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్తో పాటు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మిస్సింగ్ లిస్ట్లో ఉన్నారు.