- సీజన్లో మూడో సెంచరీతో జోరు
- రాణించిన పడిక్కల్, శాంసన్
ముంబై: కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (65 బాల్స్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 116).. ఈ సీజన్లో మూడో సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రత్యర్థితో పని లేకుండా తనకు అచ్చొచ్చిన ధనాధన్ ఆటలో పరుగుల సునామీ సృష్టించాడు. ఫలితంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 15 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 222/2 స్కోరు చేసింది.
ఈ సీజన్లో ఇదే అత్యధిక టీమ్ స్కోరు. బట్లర్కు తోడు దేవదత్ పడిక్కల్ (35 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54), సంజూ శాంసన్ (19 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 నాటౌట్) దంచారు. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఛేజింగ్లో ఢిల్లీ 20 ఓవర్లలో 207/8 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (24 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) టాప్ స్కోరర్. లలిత్ యాదవ్ (37), పృథ్వీ షా (37) ఫర్వాలేదనిపించారు. బట్లర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బట్లర్ ధనాధన్
రాజస్తాన్ ఇన్నింగ్స్లో తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో మొదలైన బట్లర్ విశ్వరూపం 19 ఓవర్ల పాటు కొనసాగింది. 4వ ఓవర్లో పడిక్కల్ హ్యాట్రిక్ ఫోర్స్తో టచ్లోకి రాగా, ఖలీల్ వేసిన ఆరో ఓవర్లో బట్లర్ రెండు సిక్సర్లతో జోరు పెంచాడు. ఫలితంగా పవర్ప్లేలో రాజస్తాన్ స్కోరు 46/0. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ బౌలింగ్కు దిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. 8వ ఓవర్ (అక్షర్)లో పడిక్కల్ 6, 4 కొడితే.. నెక్స్ట్ ఓవర్ (కుల్దీప్)లో బట్లర్ దానిని రిపీట్ చేశాడు. ఆ వెంటనే బట్లర్ మరో సిక్సర్ బాదడంతో ఫస్ట్ టెన్లో రాజస్తాన్ 87/0 స్కోరు చేసింది.
ఈ క్రమంలో బట్లర్ 36 బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. 11వ ఓవర్ నుంచి ఆట మరో మెట్టు ఎక్కింది. ఈ ఓవర్లో బట్లర్ 4, పడిక్కల్ 4, 6తో 17 రన్స్ రాబట్టారు. దీంతో పడిక్కల్ 31 బాల్స్లో హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. 13వ ఓవర్ (లలిత్)లో బట్లర్ 6, 4, 6తో వేగం పెంచాడు. తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు వచ్చినా, 15వ ఓవర్లో బట్లర్ 6, 6,4తో 18 రన్స్ సాధించాడు. అయితే 16వ ఓవర్ ఫస్ట్ బాల్కు ఖలీల్... పడిక్కల్ను ఔట్ చేయడంతో తొలి వికెట్కు 155 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. నెక్స్ట్ బాల్కే బట్లర్ సెంచరీ (57 బాల్స్) పూర్తయింది. ఈ దశలో వచ్చిన శాంసన్.. స్లాగ్ ఓవర్స్లో సునామీలా విరుచుకుపడ్డాడు. 18వ ఓవర్లో 4, 6, 4, 6తో 21 రన్స్ రాబట్టగా, తర్వాతి ఓవర్లో బట్లర్ 4, 6 కొట్టి ఔటయ్యాడు. లాస్ట్ ఓవర్లో శాంసన్ 4, 4, 6తో 20 రన్స్ రాబట్టడంతో రాజస్తాన్ భారీ టార్గెట్ను నిర్దేశించింది.
ఢిల్లీ పోరాడినా..
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి వార్నర్ (14 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 28) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. కానీ ఐదో ఓవర్లోనే వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే సర్ఫ్రాజ్ (1) ఔట్కావడంతో డీసీ 48/2తో కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ పృథ్వీకి జత కలిసిన పంత్ ఇన్నింగ్స్ను బాగు చేశాడు. స్టార్టింగ్లో నెమ్మదిగా ఆడినా, 9వ ఓవర్లో ఈ ఇద్దరు కలిసి 26 రన్స్ రాబట్టారు. ఇదే ఓవర్లో పంత్ క్యాచ్ను లాంగాన్లో హెట్మయర్ డ్రాప్ చేశాడు. కానీ 10వ ఓవర్లో అశ్విన్.. పృథ్వీని ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు. ఓవరాల్గా పవర్ప్లేలో 55/2తో ఉన్న స్కోరు ఫస్ట్ టెన్లో 99/3గా మారింది.
11వ ఓవర్లో 6, 6, 4తో 22 రన్స్ రాబట్టిన పంత్.. 12వ ఓవర్లో క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్నా... తర్వాతి బాల్కు ఔటయ్యాడు. నెక్స్ట్ ఓవర్లో అక్షర్ పటేల్ (1) వెనుదిరిగాడు. ఈ దశలో లలిత్ యాదవ్, పావెల్ (15 బాల్స్లో 5 సిక్సర్లతో 36) గట్టిగా పోరాడారు. మధ్యలో శార్దూల్ (10) రనౌటయ్యాడు. చివరకు 24 బాల్స్లో 61 రన్స్ చేయాల్సిన దశలో 17, 18 ఓవర్లలో 25 రన్స్ రావడంతో పాటు లలిత్ ఔటయ్యాడు. తర్వాతి ఓవర్ మెయిడిన్ కాగా, ఇక లాస్ట్ 6 బాల్స్లో 36 రన్స్ అవసరమయ్యాయి. ఈ దశలో పావెల్ మూడు సిక్సర్లు కొట్టినా, నో బాల్ వివాదంతో అతని ఏకాగ్రత దెబ్బతినడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 207/8 (బట్లర్ 116, పడిక్కల్ 54, శాంసన్ 46*, ముస్తాఫిజుర్ 1/43)
ఢిల్లీ: 20 ఓవర్లలో 207/8 (పంత్ 44, లలిత్ 37, పృథ్వీ 37, ప్రసిధ్ 3/22).
నో బాల్ ఇవ్వాలంటూ రచ్చ
మ్యాచ్ ఆఖరి ఓవర్లో హైడ్రామా నడిచింది. తొలి మూడు బాల్స్కు పావెల్ సిక్సర్లు కొట్టడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. ఇందులో మూడో బాల్ ఎక్కువ హైట్లో వచ్చినా నోబాల్ ఇవ్వకపోవడంతో నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న కుల్దీప్ అంపైర్లను ప్రశ్నించాడు. అదే టైమ్లో డగౌట్లోని ఢిల్లీ కెప్టెన్ పంత్, కోచ్లు ప్రవీణ్ ఆమ్రే ఆందోళన చేశారు. అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంతో పావెల్, కుల్దీప్ను వెనక్కివచ్చేయాలంటూ రిషబ్ సైగ చేశాడు. అదే టైమ్లో గ్రౌండ్లోకి వచ్చిన కోచ్ ఆమ్రేను వెనక్కిపంపిన అంపైర్లు ఆట కొనసాగించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పంత్.. అంపైర్ నితిన్ మేనన్తో వాదిస్తూ కనిపించాడు.