ముంబై: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జూలు విదిల్చింది. బ్యాటింగ్లో లివింగ్స్టోన్ (42 బాల్స్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70), జానీ బెయిర్స్టో (29 బాల్స్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 66) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 54 రన్స్ తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 209/9 స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 155/9 స్కోరుకే పరిమితమై ఓడింది. మ్యాక్స్వెల్ (22 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 35) టాప్ స్కోరర్. బెయిర్స్టో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
దంచుడే.. దంచుడు..
పంజాబ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్లో బెయిర్స్టో చెలరేగితే.. మిడిల్ మ్యాచ్ను లివింగ్స్టోన్ మరో స్థాయికి తీసుకెళ్లాడు. రెండు, ఆరో ఓవర్లో బెయిర్స్టో వరుసగా 22, 23 రన్స్ రాబట్టాడు. తొలి వికెట్కు 60 రన్స్ జోడించి ధవన్ (21) ఔట్కాగా, పవర్ప్లేలోనే పంజాబ్ 83/1 స్కోరు చేసింది. రాజపక్స (1) నిరాశపర్చినా, లివింగ్స్టోన్ దంచికొట్టాడు. మధ్యలో మయాంక్ అగర్వాల్ (19) ఫర్వాలేదనిపించాడు. లివింగ్స్టోన్తో కలిసి నాలుగో వికెట్కు 51 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశాడు. జితేశ్ శర్మ (9), హర్ప్రీత్ బ్రార్ (7), రిషి ధవన్ (7) నిరాశపర్చినా, కీలక భాగస్వామ్యాలతో లివింగ్స్టోన్ స్కోరు 200 దాటించాడు ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు.
మ్యాక్సీ మినహా..
భారీ టార్గెట్ ఛేజింగ్లో బెంగళూరు బోల్తా కొట్టింది. మ్యాక్స్వెల్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఓపెనర్లు కోహ్లీ (20), డుప్లెసిస్ (10)తో పాటు మహిపాల్ లోమ్రోర్ (6) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 40/3తో బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో రజత్ పటిదార్ (26), మ్యాక్స్వెల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఫస్ట్ టెన్లో ఆర్సీబీ 95/3తో నిలిచింది. అయితే మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్కావడంతో నాలుగో వికెట్కు 64 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. దినేశ్ కార్తీక్ (11), షాబాజ్ (9), హరసంగ (1), హర్షల్ పటేల్ (11) నిరాశపర్చడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో రబాడ మూడు, రిషి ధవన్, చహర్ తలో రెండు వికెట్లు తీశారు.