
- గెలిస్తే ప్లేఆఫ్స్కు బెంగళూరు.. ఓడితే కోల్కతా ఖేల్ ఖతం
- రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్
బెంగళూరు: అద్భుత పోరాటాలు.. అనూహ్య ఫలితాలతో.. అభిమానులను విశేషంగా అలరిస్తూ సాగుతూ చరిత్రలో తొలిసారి యుద్ధ వాతావరణం కారణంగా మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ మళ్లీ మొదలవుతోంది. ఇండియా–పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలతో నిలిచిన 18వ సీజన్లో ఎనిమిది రోజుల తర్వాత తిరిగి గ్రౌండ్లో ఢీకొట్టేందుకు పది జట్లు రెడీ అయ్యాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి జరిగే మ్యాచ్తో లీగ్ రీస్టార్ట్ అవ్వనుంది.
మిగిలిన 17 మ్యాచ్లు ఆరు వేదికల్లో జరగనుండగా.. హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ధర్మశాల వేదికలను తొలిగించారు. షెడ్యూల్ మార్పుతో కొన్ని జట్లు హోం అడ్వాంటేజీ కోల్పోగా.. పలువురు ఫారిన్ ప్లేయర్ల గైర్హాజరీలో మరికొన్ని జట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాళ్ల స్థానాల్లో తాత్కాలిక రీప్లేస్మెంట్గా కొత్త ఆటగాళ్ల చేరికతో మెగా లీగ్ ఆఖరి దశలో సరికొత్త వ్యూహాలతో సత్తా చాటాలని చూస్తున్నాయి.
ఏ జట్టు ఎక్కడ?
బ్రేక్కు ముందు 57 మ్యాచ్లు పూర్తవగా.. ఏ జట్టూ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకోలేదు. కానీ, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్తాటతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. మిగిలిన ఏడు జట్లూ టాప్–4లో చోటు కోసం హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. దాంతో లీగ్లో తదుపరి దశ ప్లేఆఫ్ రేసుగా మారింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆర్సీబీ కూడా అన్నే మ్యాచ్ల్లో సమాన పాయింట్లతో రెండో ప్లేస్లో నిలవగా.. ప్లేఆఫ్స్ చేరేందుకు ఇరు జట్లూ ఒక్క విజయం దూరంలో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ (11 మ్యాచ్ల్లో15)కు చివరి మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు అవసరం. ముంబై ఇండియన్స్ (12 మ్యాచ్ల్లో14), ఢిల్లీ క్యాపిటల్స్ (11 మ్యాచ్ల్లో13) 4,5వ స్థానాల్లో నిలిచి టాప్–4 కోసం పోటీపడుతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ (12 మ్యాచ్ల్లో 11), లక్నో సూపర్ జెయింట్స్(11 మ్యాచ్ల్లో 10 పాయింట్లు) ప్లే ఆఫ్ కంటే ఎలిమినేషన్కు దగ్గరగా ఉన్నాయి.
కీలక ప్లేయర్లు దూరం
ఐపీఎల్ షెడ్యూల్ మార్పుతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్–వెస్టిండీస్ సిరీస్తో క్లాష్ వచ్చిన కారణంగా పలువురు ఫారిన్ ప్లేయర్లు మెగా లీగ్కు పూర్తిగా దూరం అవుతుండగా.. మరికొందరు ప్లే ఆఫ్స్ దశకు అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ జట్టు ఆటగాళ్లు అందరూ వన్డే సిరీస్ కోసం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. దీంతో జాకబ్ బెథెల్ (ఆర్సీబీ), విల్ జాక్స్ (ముంబై), జోస్ బట్లర్ (గుజరాత్), ట్రిస్టాన్ స్టబ్స్ (ఢిల్లీ) వంటి ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్ దశ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్తారు. విండీస్ బోర్డు మాత్రం షెర్ఫానె రూథర్ఫోర్డ్ (గుజరాత్) , రొమారియో షెఫర్డ్ (ఆర్సీబీ)ను ఐపీఎల్లోనే కొనసాగేందుకు రిలీజ్ చేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే ఎనిమిది మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు లీగ్ దశ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోతారు. బీసీసీఐ వారిని ఐపీఎల్లో కొనసాగించమని విజ్ఞప్తి చేసినప్పటికీ సఫారీ క్రికెట్ బోర్డు ఒప్పుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లోని మిచెల్ స్టార్క్, డెనోవన్ ఫెరీరా మిగతా లీగ్ కోసం ఇండియా రావడం లేదు. ఫ్రైజర్ మెక్గర్క్ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ టెంపరరీ రీప్లేస్మెంట్గా ఢిల్లీ టీమ్లోకి రానున్నాడు. ముస్తాఫిజుర్కు బంగ్లా బోర్డు ఎన్ఓసీ ఇవ్వగా, డుప్లెసిస్ కూడా తిరిగి రానుండటం కాస్త ఊరట కలిగించింది. ఇక, సీఎస్కే ప్లేయర్లు సామ్ కరన్, జెమీ ఓవర్టన్ కూడా ఇండియా రావడం లేదు. పంజాబ్ ప్లేయర్లు మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ ఆదివారం జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు.
కోల్కతా రేసులో నిలుస్తుందా?
డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్కు ఈ మ్యాచ్లో విజయం అత్యంత కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే ప్లేఆఫ్ ఆశలు ఆవిరవుతాయి. విరామానికి ముందు మూడు మ్యాచ్లలో రెండు విజయాలు సాధించింది. అయితే, గ్యాప్ తర్వాత కేకేఆర్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. కేకేఆర్ ఈ సీజన్లో బ్యాటింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కెప్టెన్ అజింక్యా రహానె, యంగ్స్టర్ అంగ్క్రిష్ రఘువంశీ తప్ప ఇతర బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్ బ్యాట్ ఝుళిపిస్తేనే టీమ్ రేసులో నిలుస్తుంది. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా బాగా ఆడుతున్నప్పటికీ కొన్నిసార్లు ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నారు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ వైరల్ ఫీవర్ కారణంగా లీగ్ నుంచి తప్పుకోవడం జట్టుకు మైనస్ కానుంది.
అందరి కండ్లు కోహ్లీ పైనే..
ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్న ఆర్సీబీ సొంతగడ్డపై కేకేఆర్ను ఓడించి అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు విరామం ముందు వరకు పడుతూ లేస్తూ వచ్చేన కేకేఆర్కు ఈ పోరు చావోరేవో కానుంది. ఈ మ్యాచ్లో ఓడితే కోల్కతా నాకౌట్ రేసు నుంచి వైదొలుగుతుంది. దాంతో ఇరు జట్లూ ఈ పోరులో హోరాహోరీగా తలపడనుండగా.. ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలవనున్నాడు. టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన తర్వాత విరాట్ ఆడే తొలి మ్యాచ్ ఇదే కావడంతో అందరి ఫోకస్ అతనిపైనే ఉండనుంది. గత నాలుగు మ్యాచ్ల్లో ఫిఫ్టీలు కొట్టిన కోహ్లీ అదే జోరు కొనసాగిస్తే టీమ్కు తిరుగుండదు.
బ్రేక్కు ముందు ఆర్సీబీ వరుసగా నాలుగు విజయాలతో ఊపుమీద ఉంది. అయితే 8 రోజుల విరామం తర్వాత అదే జోరును కొనసాగించడం జట్టుకు సవాల్గా మారనుంది. కెప్టెన్ రజత్ పటీదార్ చేతి వేలి గాయం నుంచి కోలుకోవడం ఆ టీమ్కు ప్లస్ పాయింట్. ఫారిన్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్, లుంగి ఎంగిడి, టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్, రొమారియో షెఫర్డ్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం కూడా అడ్వాంటేజ్ కానుంది. కానీ, గాయాల కారణంగా దేవదత్ పడిక్కల్ ఈ సీజన్ నుంచి తప్పుకోగా..పేసర్ జోష్ హేజిల్వుడ్ తిరిగి రాకపై స్పష్టత లేదు. పడిక్కల్ స్థానంలో టీమ్లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.