
ముంబై:
భారత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) మార్కెట్ వచ్చే వారం బిజీగా మారనుంది. నాలుగు కంపెనీలు – గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ , హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ , ఎలెన్బారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్, కల్పతరు కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి మొత్తం రూ.15 వేల కోట్లను పబ్లిక్ మార్కెట్ల నుంచి సేకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్ మార్చి నుంచి 12 శాతం ర్యాలీ చేయడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యంగా 50 బేసిస్ పాయింట్ల రేటు కోతతో సహా మద్దతుగా లిక్విడిటీ చర్యలు తీసుకోవడం వంటి కారణాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ పుంజుకుంది. ఈ సానుకూల వాతావరణం ఐపీఓల రాకకు ఊతమిస్తోంది.
హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మద్దతుగల నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ నాలుగింటిలో అతిపెద్ద ఐపీఓ. ఇది ఈ నెల 24న మొదలై 27న ముగుస్తుంది. గతేడాది హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.27 వేల కోట్ల ఇష్యూ తర్వాత ఇదే అతిపెద్ద ఆఫర్గా నిలవనుంది. హెచ్డీబీలో 94.6శాతం వాటా కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఈ ఆఫర్లో భాగంగా రూ.10వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.12,500 కోట్లు సేకరించనుంది. ఇందులో రూ.2,500 కోట్ల ఫ్రెష్ఇష్యూ కాగా, మిగిలిన షేర్లను ఓఎఫ్ఎస్ద్వారా అమ్ముతారు. ఈ ఎన్బీఎఫ్సీ లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, వినియోగదారుల క్రెడిట్, ఆస్తి ఫైనాన్సింగ్ వంటి అనేక రిటైల్, వాణిజ్య క్రెడిట్ ఉత్పత్తులను అందిస్తోంది.
ఎలెన్బారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్
పారిశ్రామిక గ్యాస్ ఉత్పత్తిదారు ఎలెన్బారీ కూడా రూ.852 కోట్ల ఐపీఓతో మార్కెట్లో అడుగుపెట్టాలని యోచిస్తోంది. ఈ ఆఫర్లో రూ.400 కోట్ల ఫ్రెష్ ఇష్యూతోపాటు ప్రమోటర్లు పదమ్ కుమార్ అగర్వాలా, వరుణ్ అగర్వాల్ ద్వారా 1.13 కోట్ల షేర్ల ఆఫర్ -ఫర్- సేల్ ఉన్నాయి.తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను రుణాల చెల్లింపు, ఉలుబెరియా ప్లాంట్లో కొత్త ఎయిర్ సెపరేషన్ యూనిట్లో పెట్టుబడి, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఒక్కో షేరు ధరను రూ.380 నుంచి రూ.400 మధ్య నిర్ణయించారు.
కల్పతరు
ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ కల్పతరు ఐపీఓ ద్వారా రూ.1,590 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఈ ఐపీఓ జూన్ 24న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది. ప్రధాన భారతీయ నగరాల్లో నివాస వాణిజ్య ప్రాజెక్టులకు కల్పతరు ప్రసిద్ధి చెందింది. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ.387–రూ.414. ఈ కంపెనీ కల్పతరు గ్రూప్లో భాగం. ఇందులో మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ వ్యాపారాలు ఉన్నాయి.
గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీఓ
ఈ నెల 24న ప్రారంభం కానున్న మరో ఐపీఓ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్. ఇది నిర్మాణ మౌలిక సదుపాయాల సంస్థ. ఒక్కో షేరు ధరను రూ.67 నుంచి రూ.71 మధ్య నిర్ణయించారు. షేర్ల కేటాయింపు జూన్ 27న జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇష్యూ పరిమాణం రూ.119.00 కోట్లు కాగా, ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. ఓఎఫ్ఎస్ భాగం లేదు. లిస్టింగ్ జులై ఒకటో తేదీన ఉండనుంది. ఈ నాలుగు ఆఫర్లు తక్కువ వ్యవధిలోనే మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారుల భాగస్వామ్యం, లిస్టింగ్ లాభాలపై ఆసక్తి నెలకొంది.