న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజన్సీ (ఇరెడా) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 643 కోట్లు సమీకరించింది. 58 ఫండ్స్కు ఒక్కో షేర్కు రూ. 32 చొప్పున 20.10 కోట్ల షేర్లను ఇరెడా జారీ చేసింది. అంటే, ఐపీఓ అప్పర్ ప్రైస్బ్యాండ్ దగ్గరే ఈ షేర్లను జారీ చేసినట్లు. షేర్లు తీసుకున్న యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాలో గోల్డ్మన్ శాచ్స్, ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రేటజీస్, సొసైటీ జనరాలి, గ్యామ్ స్టార్ ఎమర్జింగ్ ఈక్విటీ, బీఎన్పీ పరిబస్ ఆర్బిట్రేజ్ వంటివి ఉన్నాయి. అంతేకాదు, యాంకర్ బుక్లో హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ , ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్
కోటక్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటివి కూడా పాల్గొన్నాయి. ఇరెడా తొలి ఐపీఓ మంగళవారం మొదలయింది. రూ. 30 – రూ.32 ధర వద్ద ఇరెడా ఐపీఓ చేస్తోంది. ఈ నెల 23 దాకా ఐపీఓ ఓపెన్లో ఉంటుంది. రూ. 1,290 కోట్ల సేకరణ కోసం 40.31 కోట్ల తాజా షేర్లను ఇరెడా జారీ చేయనుంది. గవర్నమెంట్ తన వాటాలో 26.88 కోట్ల షేర్లను ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ కోసం ఉంచుతోంది.