హోబర్ట్: మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో టీ20 వరల్డ్ కప్లో రెండు సార్లు చాంపియన్. జట్టు నిండా హార్డ్ హిట్టర్లు, ఆల్రౌండర్లు. ఒక్క ఓవర్లో ఫలితాలను తారుమారు చేసే టాలెంట్ సొంతం. ఎదురుగా ఎంత పెద్ద జట్టున్నా తెగించి ఆడే తత్వం. అలాంటి వెస్టిండీస్ పసికూనల చేతిలో ఘోర ఓటములతో టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. 2007లో మొదలైన మెగా టోర్నీలో తొలిసారి సూపర్12కు క్వాలిఫై అవ్వకుండా ఇంటిదారి పట్టింది. తొలి పోరులో స్కాట్లాండ్ చేతిలో షాక్ తిన్న కరీబియన్లు తాజాగా ఐర్లాండ్ చేతిలో చిత్తయ్యారు. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) మెరుపులకు తోడు లెగ్ స్పిన్నర్ గారెత్ డెలానీ (4–0–16–3) కెరీర్ బెస్ట్ బౌలింగ్తో శుక్రవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్లో ఐరిష్ టీమ్ తొమ్మిది వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసి సూపర్12 బెర్తు సాధించింది.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత విండీస్ 20 ఓవర్లలో 146/5 స్కోరు మాత్రమే చేసింది. బ్రెండన్ కింగ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 62 నాటౌట్) ఫిఫ్టీతో రాణించాడు. జాన్సన్ చార్లెస్ (24) ఆకట్టుకున్నాడు. కానీ, కైల్ మేయర్స్ (1), ఎవిన్ లూయిస్ (13), కెప్టెన్ నికోలస్ పూరన్ (13), పావెల్ (13) ఫెయిలయ్యారు. చివర్లో ఒడియన్ స్మిత్ (19 నాటౌట్) మెరుపులతో విండీస్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. గారెత్తో పాటు మెకార్తీ (1/33), సిమి సింగ్ (1/11) చెరో వికెట్ తీశారు. అనంతరం ఐర్లాండ్ 17.3 ఓవర్లలో 150/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు స్టిర్లింగ్, ఆండీ బల్బర్నీ (23 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37)తో పాటు లోర్కాన్ టక్నర్ (35 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్) సత్తా చాటాడు. డెలానీ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
జింబాబ్వే ముందుకు
ఆరేళ్లుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా ఆడని జింబాబ్వే రీఎంట్రీలో సత్తా చాటుతూ సూపర్12కి చేరుకుంది. సికిందర్ రజా (1/20; 23 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) ఆల్రౌండ్ మెరుపులతో పాటు కెప్టెన్ క్రెయిన్ ఎర్విన్ (54 బాల్స్లో 6 ఫోర్లతో 58) సత్తా చాటడంతో గ్రూప్–బి చివరి పోరులో స్కాట్లాండ్ను ఓడించి ముందంజ వేసింది. తొలుత స్కాటిష్ టీమ్ 20 ఓవర్లలో 132/6 స్కోరు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే (54) టాప్ స్కోరర్. అనంతరం ఎర్విన్, రజా రాణించడంతో జింబాబ్వే 18.3 ఓవర్లలో 133/5 స్కోరు చేసి గెలిచింది. రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.