- అధికార పార్టీ కౌన్సిలర్లపై తరచూ ఆరోపణలు
- తాజాగా కమిషనర్ సంతకం ఫోర్జరీతో కలకలం
సూర్యాపేట, వెలుగు : హుజూర్నగర్ మున్సిపాలిటీలో బయటపడుతున్న అవినీతి, అక్రమాలు జిల్లాలో హాట్టాపిక్గా మారాయి. మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల తీరు సరిగా లేదని, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నారని కొన్నేళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మున్సిపాలిటీ స్థలానికి ఇంటి నంబర్ కేటాయించుకున్న విషయం బయటపడడం తీవ్ర దుమారం రేపుతోంది.
మున్సిపాలిటీలో జరిగిందిదీ...
హుజూర్నగర్ పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 199లో గల మున్సిపల్ స్థలానికి ఇంటి నంబర్ కేటాయించి అమ్మకానికి పెట్టారు. ఈ ఖాళీ స్థలం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇంటికి పక్కనే ఉండగా, దీని విలువ గజం రూ.25 వేల వరకు పలుకుతోంది. అర ఎకరం వరకు వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వ్యవసాయ భూమికి ఎలాంటి నాలా కన్వర్షన్, మున్సిపాలిటీ అనుమతులు లేవు. అయినా ఈ స్థలంలో ఓ చిన్న రేకుల షెడ్ నిర్మించి, ఇంటి నంబర్ కేటాయించడం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ఖాళీ స్థలానికి ఇంటి నంబర్ ఎలా కేటాయించారు అన్నదే వివాదానికి కారణమైంది. మున్సిపల్ ఆఫీస్లోని కమిషనర్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ దొంగిలించి పలు ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించి అమ్మకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలన్నింటికీ చైర్పర్సన్ భర్త గెల్లి రవి కారణమని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం 21వ వార్డు కౌన్సిలర్ గాయత్రి భర్త భాస్కర్రావు పేరిట నమోదు అయి ఉండగా, అతడి పేరిటే కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్కు అప్లై చేసుకున్నారు. అయితే ఫోర్జరీ పత్రాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ మూడో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కోతి సంపత్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు.
గతంలోనూ ఎన్నో ఆరోపణలు
హుజూర్నగర్ మున్సిపాలిటీలో అధికార పార్టీ కౌన్సిలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. 2020లో రూ.80 లక్షలతో హుజూర్నగర్ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా పుట్పాత్ పనులు చేయగా, ఈ బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు అప్పటికే నిర్మించిన కల్వర్టులకు కూడా బిల్లులు డ్రా చేసినట్లు కౌన్సిల్ సమావేశంలోనే పలువురు కౌన్సిలర్లు నిలదీశారు. స్థానిక సాయిబాబా థియేటర్ సమీపంలోని ఓ లేఅవుట్లో మున్సిపాలిటీకి అప్పగించిన కోట్ల విలువైన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు మాయం అయ్యాయి. అయితే కొందరు కౌన్సిలర్లే ఓ రియల్టర్తో కుమ్మక్కై డాక్యుమెంట్లు మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలోనూ రూ.10 లక్షల అవినీతి జరిగినట్లు విమర్శలు వచ్చాయి. హుజూర్నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మంత్రి కేటీఆర్కు లెటర్ రాశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి అవినీతి జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వరుస వివాదాలు.. ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు
మున్సిపాలిటీలో బయటపడుతున్న అవినీతి, అక్రమాలు సిబ్బంది మెడకు చుట్టుకుంటున్నాయి. మున్సిపాలిటీలో రెండున్నరేళ్లలోనే ఐదుగురు కమీషనర్లు మారారంటే వారిపై ఏ స్థాయి ఒత్తిడి ఉందో అర్థం అవుతుంది. కౌన్సిలర్లు కమిషనర్ల లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు దొంగిలించి గుట్టుచప్పుడు కాకుండా పనులు పూర్తి చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫోర్జరీ వాస్తవమే
పట్టణంలోని ఓ భూమిలో గల రేకుల షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించడం కోసం నా సంతకం ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. విచారణలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్నగర్
చర్యలు తీసుకోవాలి
మున్సిపాలిటీలో ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఆదాయమంతా కొందరు అక్రమార్కుల చేతుల్లోకి పోతోంది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. భార్యల చాటున భర్తలు పెత్తనం చేస్తున్నరు. దీనిపై పోరాడుతూనే ఉంటాం.
– కోతి సంపత్రెడ్డి, కౌన్సిలర్, హుజూర్నగర్
