- ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచిన నీటిపారుదల శాఖ
కొడంగల్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ నారాయణపేట –- కొడంగల్ఎత్తిపోతల పనుల్లో నీటిపారుదల శాఖ వేగం పెంచింది. ప్రాజెక్టు గ్రౌండ్రిపోర్టుతో పాటు ఎత్తిపోతల, అప్రోచ్కాలువలు, చెరువుల సామర్థ్యం, ప్రెషర్మెయిన్మార్గం, జలాశయాల నిర్మాణం వంటి సమగ్ర అంచనాకు లైడార్ సర్వే పనులు షురూ చేసింది. గురువారం హెలికాప్టర్ కొడంగల్కు వచ్చింది. కొడంగల్, నారాయణపేట, మక్తల్ సెగ్మెంట్లలో సర్వే పనులు చేపట్టనుంది. కొడంగల్ కేంద్రంగా 10 రోజుల పాటు లైడార్సర్వే ద్వారా ప్రాజెక్ట్ స్టేటస్ తెలియనుంది. రూ. 3,445 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయి.
పనులకు సీఎం రేవంత్రెడ్డి శంఖుస్థాపన చేశారు. రాజీవ్– భీమా పథకం నుంచి 7టీఎంసీలు, భూత్పూర్ జలాశయం నుంచి 7 టీఎంసీల మిగులు జలాలను ఎత్తి పోస్తారు. ఊట్కూర్, మక్తల్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్, కొడంగల్, బొంరాస్పేట మండలాల్లోని లక్ష 30వేల ఎకరాల్లో సాగు, తాగు నీరందనుంది. లైడార్సర్వే అనంతరం టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయితే కొడంగల్, నారాయణపేట, మక్తల్ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి.