హైదరాబాద్, వెలుగు: కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల ప్రతిపాదనలకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం కమిటీ ఆమోదం తెలిపింది. కడెం ప్రాజెక్టు రిపేర్లకు కోటి రూపాయాల వ్యయం అవుతుందని అంచనా వేయగా.. అందుకు కమిటీ ఆమోద ముద్ర వేసింది. గురువారం జలసౌధలో ఓ అండ్ఎం ఈఎన్సీ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రిపేర్లకు కమిటీ ఓకే చెప్పింది. రూ.30 కోట్లతో 83 ప్రాజెక్టులకు రిపేర్లు చేయించేందుకు అంగీకరించింది.
నాగర్కర్నూల్ మినహా మిగతా అన్ని సర్కిళ్ల పరిధిలోని మేజర్, మీడియం ప్రాజెక్టులు, వాటి కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, చెరువుల రిపేర్లపై సమావేశంలో చర్చించారు. కడెం ప్రాజెక్టు రిపేర్లలో భాగంగా ప్రాజెక్టు గేజ్ రూమ్, తదితర మరమ్మతులకు పనులకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా సాత్నాల, నాగార్జున సాగర్ ఎడమకాలువ, ఈ ఏడాది వరదలకు దెబ్బతిన్న చెరువుల పునరుద్ధరణ పనులకు కమిటీ ఆమోదం తెలిపింది.
