
- 300 హెజ్బొల్లా డ్రోన్లను కూల్చేసిన ఐరన్ బీమ్
- ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి: ఐడీఎఫ్
జెరూసలెం: గతేడాది లెబనాన్లో తమకు, హెజ్బొల్లా మిలిటెంట్లకు మధ్య ఘర్షణలో కొత్త లేజర్ వ్యవస్థను ఉపయోగించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. ఇజ్రాయెల్ కు చెందిన రఫాయెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ సంస్థ రూపొందించిన "ఐరన్ బీమ్" వ్యవస్థలో తక్కువ శక్తి గల "లైట్ షీల్డ్" అనే ఆయుధాన్ని వాడినట్లు తెలిపింది. ఇది30 కిలోవాట్ శక్తితో పని చేస్తుందని చెప్పింది.
ఘర్షణల టైంలో ఇజ్రాయెల్పై 300కి పైగా పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లను హెజ్బొల్లా ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది. దాదాపు అన్ని డ్రోన్లను తమ కొత్త ఆయుధం ఐరన్ బీమ్ లేజర్ ఇంటర్సెప్టర్ విజయవంతంగా అడ్డుకుందని చెప్పింది. 2024 అక్టోబర్ చివరిలో ఈ వ్యవస్థ.. మొదటిసారిగా నాలుగు హెజ్బొల్లా డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసిందని పేర్కొంది. ఆ తర్వాత మరిన్ని డ్రోన్లను అడ్డగించిందని తెలిపింది.
ఈ లేజర్ వ్యవస్థ శత్రువులు ప్రయోగించిన డ్రోన్లను అద్భుతంగా అడ్డుకొని పౌరుల ప్రాణాలు కాపాడటంతోపాటు.. దేశ ఆస్తులను రక్షించిందని ఐడీఎఫ్ ప్రశంసించింది. ఒక్కో అడ్డగింతకు కేవలం 2 డాలర్లు మాత్రమే ఖర్చు అయినట్లు వెల్లడించింది. 2025 చివరి నాటికి ఐరన్ బీమ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ఐరన్ బీమ్ వ్యవస్థ విజయవంతంగా డ్రోన్లను కూల్చివేసిన వీడియోలను విడుదల చేసింది.