
ఏ డేటా ఇస్తుందోనని నాసా కూడా ఎదురు చూస్తోంది
సెప్టెంబర్ 7న అర్ధరాత్రి 1.55 గంటలకు ల్యాండింగ్
మాంజినస్ సీ, సింపె లియస్ ఎన్ లోయల మధ్య స్పాట్: ఇస్రో చైర్మన్ శివన్
ప్రపంచం మొత్తం చంద్రయాన్ 2 ప్రయోగాన్ని నిశితంగా గమనిస్తోందని, దేశాల చూపంతా చంద్రయాన్ 2 ల్యాండింగ్పైనే ఉందని ఇస్రో చైర్మన్ కే శివన్ అన్నారు. చైనా సహా ఏ దేశమూ వెళ్లలేని చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుండడమే అందుకు కారణమని ఆయన అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీళ్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ‘‘సెప్టెంబర్ 7 అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 1.55 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగుతుంది. దక్షిణ ధ్రువం ఈక్వేటర్కు 71 డిగ్రీలు, తూర్పుకు 38 డిగ్రీల దూరంలో ఉన్న మాంజినస్ సీ, సింపెలియస్ ఎన్ అనే రెండు లోయల మధ్య విక్రమ్ ల్యాండ్ అవుతుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన వివరాలను చంద్రయాన్ 2 సేకరిస్తుంది. ఆ వివరాలు భవిష్యత్తులో ఇండియా చేయబోయే చంద్రుడి ప్రయోగాలకు, ఇతర దేశాలు కట్టాలనుకుంటున్న బేస్ ప్రయోగాలకు ఉపయోగపడతాయి.
ఇప్పటికే దక్షిణ ధ్రువం వద్ద మనిషి మనుగడకు అవసరమయ్యే బేస్ను కడతామని నాసా ప్రకటించింది. చంద్రయాన్ 2 ఇచ్చే డేటా కోసమే నాసా ఎదురు చూస్తోంది” అని అన్నారు. విక్రమ్ దిగాక నాలుగు గంటలకు రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుందని చెప్పారు. సెకనుకు ఒక సెంటీమీటర్ స్పీడ్ చొప్పున అది వెళుతుందని అన్నారు. ఆ తర్వాత గంటన్నరకు చంద్రుడి ఫొటోలను ప్రజ్ఞాన్ భూమ్మీదికి పంపుతుందన్నారు. అయితే, రోవర్కు అటానమస్ వ్యవస్థలు లేకపోవడం వల్ల ల్యాండర్ లేదా ఆర్బిటర్ సహకారంతో ఆ ఫొటోలను పంపుతుందని వివరించారు. రోవర్ పంపిన ఫొటోలను పరిశీలించిన తర్వాత జనానికి అందుబాటులో ఉంచుతామని, నాసా కూడా ఆ డేటాను వాడుకోవచ్చని చెప్పారు. చంద్రయాన్ సహా రెండు సార్లు ఇండియా ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిందన్నారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని కూడా చేస్తామని తెలిపారు. ఆడ, మగ అన్న తేడాను ఇస్రో ఎప్పుడూ చూడదని, టాలెంట్ను మాత్రమే ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. వాళ్లకే గుర్తింపు, అవకాశాలు వస్తాయన్నారు.
శివన్కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు
ఇస్రో చైర్మన్ను తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుతో గౌరవించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్లో ఎనలేని సేవలందిస్తున్న ఆయనకు అవార్డును ఇస్తున్నట్టు ఇంతకుముందే ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. నిజానికి పంద్రాగస్టు నాడే అవార్డు తీసుకోవాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. తాజాగా గురువారం తమిళనాడు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కే పళనిస్వామి ఆయనకు అవార్డును అందజేశారు. అవార్డులో భాగంగా 8 గ్రాముల బంగారు పతకం, ₹5 లక్షల నజరానా ఆయనకు అందనుంది. దాంతో పాటు ఓ ప్రశంసా పత్రమూ ఆయనకు ఇచ్చారు. చంద్రయాన్ 2 మిషన్ ఆయన నేతృత్వంలోనే జరిగిందన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ‘సితార’ అనే 6డీ ట్రాజెక్టరీ సిములేషన్ (కక్ష్య అనుకరణ) సాఫ్ట్వేర్నూ ఆయనే తయారు చేశారు.