భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2024 జనవరి 1వ తేదిన మరో రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ మేరకు సోమవారం జనవరి 1నరాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్3, ఆదిత్య ఎల్1 ప్రయోగాలతో విజయం సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ముఖ్య ప్రయోగాన్ని 2024 కొత్త సంవత్సరం తొలి రోజునే ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో జనవరి 1వ తేదిన అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.
కొత్త సంవత్సరం జనవరి 1 సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇందుకోసం శనివారం ( 2023 డిసెంబర్30) ప్రయోగ సన్నద్ధతపై లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలను ఇస్రో అధికారులు నిర్వహించారు. ఆదివారం ( డిసెంబర్ 31) ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమయింది.
జనవరి 1వ తేదిన సోమవారం రాకెట్ ను ప్రయోగించడానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈసారి ఎక్స్-రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడానికి ఈ మిషన్ ను ఇస్రో ప్రారంభించనుంది. ఈ ఎక్స్పోశాట్ జీవితకాలం ఐదేళ్లు కావడం విశేషం. అయితే ఇదేవిధంగా ఎక్స్పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్లను కూడా ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.దీనికి పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్(పీవోఈఎం) అని నామకరణం చేశారు.