
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్ యాన్ మిషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సగానికి పైగా పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. గగన్ యాన్ మిషన్కు సంబంధించి రాబోయే ఆక్సియం-4 మిషన్ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో షార్ట్లిస్ట్ చేయబడిన మైక్రోగ్రావిటీ పరిశోధన ప్రయోగాలను నిర్వహించనుందని ఇస్రో అధికారిక ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో గగన్ యాన్ మిషన్ కు సంబంధించి ఆక్సియం-4 మిషన్ సమయంలో నిర్వహించే వివిధ జాతీయ పరిశోధన ,అభివృద్ధి ప్రయోగశాలలు, విద్యాసంస్థల నుంచి ఇండియన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ (PIలు) ప్రతిపాదించిన ఏడు మైక్రోగ్రావిటీ పరిశోధన ప్రయోగాలను ISRO షార్ట్లిస్ట్ చేసింది.
మానవ ఆరోగ్యం, భౌతిక,జీవిత శాస్త్రాలు, పదార్థ పరిశోధన, ఔషధ అభివృద్ధి ,బయోటెక్నాలజీ వంటి విభిన్న రంగాలలో అనువర్తనాలతో కూడిన సూక్ష్మగురుత్వాకర్షణ పరిశోధనలు చేయనున్నారు.
పరిశోధన గురించి..
ఈ పరిశోధనలో ISSలో తినదగిన మైక్రోఆల్గేలపై మైక్రోగ్రావిటీ రేడియేషన్ ప్రభావంపై పరిశోధనలు, అంతరిక్షంలో సలాడ్ విత్తనాలు మొలకెత్తించడం, సిబ్బంది పోషణ, యూటార్డిగ్రేడ్ పారామాక్రోబయోటస్ sp మనుగడ, పునరుజ్జీవనం, పునరుత్పత్తి ,ట్రాన్స్క్రిప్టోమ్ వంటివాటిపై పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్షంలో BLR జాతి, మైక్రోగ్రావిటీ కింద కండరాల పునరుత్పత్తిపై జీవక్రియ సప్లిమెంట్ల ప్రభావం, మైక్రోగ్రావిటీలో ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలతో మానవ పరస్పర చర్యను విశ్లేషించడం,ఆహార పంట విత్తనాలలో పెరుగుదల ,దిగుబడి పారామితులపై మైక్రోగ్రావిటీ ప్రభావంపై పరిశోధనలు చేయనున్నారు. ఈ ప్రయోగాలు ISS లో అందుబాటులో ఉన్న పరిశోధన సౌకర్యాలను ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
భారత వైమానిక దళ పైలట్ భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఈ మిషన్లో పైలట్గా వ్యవహరిస్తారు. శుక్లాతో పాటు ఆక్స్-4 మిషన్లో ఇద్దరు మిషన్ నిపుణులు -యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ (పోలాండ్) ,టిబోర్ కాపు (హంగేరీ) - అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేయనున్నారు. నాసా మాజీ వ్యోమగామి ,ఆక్సియమ్ స్పేస్లో మానవ అంతరిక్ష ప్రయాణ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ ఈ వాణిజ్య మిషన్కు నాయకత్వం వహిస్తారు.
ఆక్సియం మిషన్ 4 (Ax-4) అనేది స్పేస్ఎక్స్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ప్రైవేటుగా నిర్వహిస్తున్న అంతరిక్ష యాత్ర. జూన్ 9, 2025న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమయ్యే ఈ మిషన్లోభారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా కూడా ISS కు వెళ్లనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని పంపడం ,భవిష్యత్తులో వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం లక్ష్యంగా ఈ మిషన్ కొనసాగుతుంది. స్పేస్ఎక్స్, నాసాతో కలిసి ఆక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి SpaceX ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.