- ఫుల్టైం స్కాలర్స్కే ఇచ్చేలా మొదట నోటిఫికేషన్
- స్క్రూటినీ పూర్తయ్యాక పార్ట్టైం అభ్యర్థులకూ అవకాశం ఇచ్చేలా సవరణ
- ఈసీ ఆమోదం లేకుండానే నిర్ణయాలు
- కావాల్సినవాళ్లకు అడ్మిషన్లు ఇచ్చేందుకేననే ఆరోపణలు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేండ్ల తరువాత చేపట్టిన పీహెచ్డీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. యూజీసీ రూల్స్ను పక్కాగా అమలు చేయాల్సిన ఆఫీసర్లు ఇష్టారీతిన రూల్స్మార్చి అడ్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేటగిరీ వన్ ఖాళీల భర్తీలో పార్ట్టైమ్అభ్యర్థులకు అవకాశం లేకుండా, ఫుల్ టైమ్ స్కాలర్స్ మాత్రమే అర్హులని నోటిఫికేషన్ విడుదల చేసిన ఆఫీసర్లు.. ఇంటర్వ్యూల చివరి రోజున దానిని సవరించారు. వాస్తవానికి నోటిఫికేషన్ రూల్స్ సవరించాలంటే డీన్స్ కమిటీ సిఫారసులను స్టాండింగ్ కమిటీతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈసీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూల్స్ మార్చేసిన్రు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2017లో చివరిసారిగా పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థి సంఘాల ఆందోళనలు, అభ్యర్థనల నేపథ్యంలో వర్సిటీ దిగివచ్చి మరోసారి పీహెచ్డీ ప్రవేశాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కేయూలో మొత్తం 424 పీహెచ్డీ అడ్మిషన్లకు కేటగిరీ వన్ కింద 212 స్థానాలకు గతేడాది డిసెంబర్20న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో అభ్యర్థులు తప్పనిసరిగా జేఆర్ఎఫ్, యూజీసీ నెట్, గేట్, సెట్, ఎంఫిల్అర్హత కలిగి ఉండాలని పేర్కొంది. అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జనవరి 20 వరకు ఆన్లైన్అప్లికేషన్లు స్వీకరించింది. దాదాపు 4 వేల వరకు దరఖాస్తులు రాగా.. అడ్మిషన్స్ కమిటీ అప్లికేషన్ల స్ర్కూటినీ ప్రారంభించింది. రూల్స్కు అనుగుణంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించింది. మే 20 నుంచి 28 వరకు వివిధ డిపార్ట్మెంట్ల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. మే 28న ఫైనల్ మెరిట్ ప్రకటించి అడ్మిషన్ల జాబితా విడుదల చేయాల్సి ఉంది. కానీ అదే రోజు డీన్స్ కమిటీ రిసొల్యూషన్ పేరుతో నోటిఫికేషన్ను మోడిఫై చేసింది. రూల్స్లో మార్పులు ఏమైనా ఉంటే అప్లికేషన్లు గడువు చివరి తేదీలోగా చేయాలి. కానీ అడ్మిషన్ ప్రక్రియ చివర్లో రూల్స్సవరించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలో అకడమిక్కు సంబంధించి ప్రతి విషయాన్ని పబ్లిక్ డొమైన్లో పొందుపరచాల్సి ఉంది. కానీ వర్సిటీ ఆఫీసర్లు మాత్రం ఈ విషయంలో పారదర్శకతను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
నిరాశలో ఫుల్టైం అభ్యర్థులు
యూజీసీ రూల్స్ ప్రకారం కేటగిరీ వన్ పీహెచ్డీ అడ్మిషన్లకు కేవలం ఫుల్టైం రీసెర్చ్స్కాలర్స్ మాత్రమే అర్హులని, పార్ట్ టైం అభ్యర్థులకు అవకాశం లేదని నోటిఫికేషన్లో పొందుపరిచారు. మొదట్నుంచీ పార్ట్ టైం అభ్యర్థులకు అవకాశం లేదని చెప్పి.. చివరకు పార్ట్ టైం అభ్యర్థులకే 25 శాతం సీట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల్లో పని చేసే లెక్చరర్లు, ప్రొఫెసర్లను తీసుకునేలా రూల్స్సవరించారు. ఇలా పార్ట్ టైం రీసెర్చ్స్కాలర్స్కు అవకాశం ఇవ్వడంతో అన్ని అర్హతలు ఉన్న ఫుల్ టైం పీహెచ్డీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మొత్తంగా 50కిపైగా పీహెచ్డీ సీట్లు పుల్ టైమ్అభ్యర్థులు కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే వివిధ సంస్థల్లో పని చేసే అభ్యర్థులు ఇంటర్వ్యూకు ముందే సంస్థ నుంచి ఎన్వోసీలు సమర్పించాల్సి ఉంది. అయితే దాదాపు 20 శాతం అభ్యర్థులు ఎన్వోసీ ఇవ్వకున్నా వారికి ఇంటర్వ్యూలు పూర్తి చేసి, ఎన్వోసీ సమర్పణకు గడువు పొడగించడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కమిటీల ఆమోదం లేకుండానే..
అడ్మిషన్ల రూల్స్మొదలుకొని, పూర్తి ప్రక్రియకు స్టాండింగ్కమిటీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. కానీ పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ రెండు కమిటీల ఆమోదం లేకుండానే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఈసీ మెంబర్స్ ఈ నెల 13న జరిగిన మీటింగ్లో ప్రశ్నించారు. దీంతో వీసీతోపాటు ఇతర ఉన్నతాధికారులు మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోవడం గమనార్హం. దగ్గరివాళ్లకు సీట్లు కేటాయించేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీహెచ్డీ ప్రవేశాల్లో గందరగోళం నేపథ్యంలో వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేయూ ఆఫీసర్ల తీరుతో తమ భవిష్యత్తు ఆగమవుతోందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఏదో మతలబుంది
ఇంటర్వ్యూలు పూర్తయిన తరువాత రూల్స్మార్చడం వెనుక ఏదో మతలబు ఉంది. అడ్మిషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక రూల్స్మార్చారు. వారికి సంబంధించిన వాళ్లకు అడ్మిషన్లు ఇవ్వడానికే 25 శాతం సీట్లు పార్ట్ టైం రీసెర్చ్ స్కాలర్స్కు కేటాయించారు. అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. సీట్లు కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా వర్సిటీ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.
- మాచర్ల రాంబాబు, పీహెచ్డీ ఆస్పిరెంట్
ఇష్టమొచ్చినట్లు సవరించిన్రు
పీహెచ్డీ ప్రవేశాల్లో కేయూ ఆఫీసర్లు యూజీసీ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించారు. ఇష్టమొచ్చినట్లు రూల్స్ సవరించి పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చారు. సంవత్సరాల తరబడి పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తే చివరికి వర్సిటీ ఆఫీసర్ల నిర్ణయాలతో ఎంతోమంది అడ్మిషన్లు పొందలేకపోయాం.
- అంబాల కిరణ్, పీహెచ్డీ ఆస్పిరెంట్
డీన్స్ కమిటీ నిర్ణయం మేరకే..
పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. చివరి రోజున డీన్స్కమిటీ నిర్ణయం మేరకే రూల్స్మారుస్తూ కేటగిరీ వన్అడ్మిషన్లలో 25 శాతం పార్ట్ టైం రీసెర్చ్స్కాలర్లకు అవకాశం కల్పించాం. వర్సిటీలో అభ్యర్థులకు సరిపడా ప్రొఫెసర్లు లేరు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ ప్రొఫెసర్ల ను పార్ట్టైం పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్లుగా తీసుకోవడం వల్ల మిగతా అభ్యర్థులకు కూడా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం.
- ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి,
కేయూ రిజిస్ట్రార్