- కొండగట్టులో ప్రత్యేక పూజలు.. అదే రోజు బస్సు యాత్ర షురూ
- అంజన్న సన్నిధిలోనే ప్రచార రథాలను ప్రారంభించనున్న నేతలు
- అదే రోజు సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో
హైదరాబాద్/జగిత్యాల/కొండగట్టు, వెలుగు : కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నది. రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల18న తెలంగాణకు వస్తారని తెలుస్తున్నది. మూడు రోజుల పాటు వారిద్దరూ ఇక్కడే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.18, 19, 20 తేదీల్లో నిర్వహించే బస్సు యాత్రల్లో వాళ్లు పాల్గొంటారని సమాచారం. వాస్తవానికి ఈ నెల15న బస్సు యాత్రను ప్రారంభిస్తారని అనుకున్నా, సోమవారం లిస్ట్ ప్రకటించే అవకాశం ఉండటంతో 18వ తేదీన కొండగట్టు అంజన్న సన్నిధిలోనే బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అందులో భాగంగానే శుక్రవారం ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్కమిటీ సమావేశంలో తెలంగాణ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ టూర్ వివరాలను ప్రతిపాదించినట్టు తెలిసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోనూ దీనిపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర నేతల ప్రతిపాదనకు రాహుల్, ప్రియాంకలు సూచనప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. టూర్లో భాగంగా18న(బుధవారం) రాహుల్, ప్రియాంక జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ప్రచార రథాలను (బస్సులు) వారిద్దరూ జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్తున్నారు.
అనంతరం అదే రోజు మల్యాల మీదుగా జగిత్యాల చేరుకుని కొత్త బస్టాండ్ చౌరస్తాలో రోడ్షో నిర్వహిస్తారని, అక్కడ రాహుల్గాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటనల నేపథ్యంలో జగిత్యాల, కొండగట్టు వద్ద ఏర్పాట్లను ఏఐసీసీ సెక్రటరీ సుశాంక్మిశ్రా, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, మేడిపల్లి సత్యంలు పరిశీలించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జగిత్యాల నుంచే రాహుల్ గాంధీ ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు.
రూట్ మ్యాప్ ఖరారు?
వాస్తవానికి తొలుత ఆదిలాబాద్ జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. పొలిటికల్అఫైర్స్కమిటీ మీటింగ్లోనూ దీనిపై చర్చించారు. అయితే, తాజాగా బస్సు యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించాలని పార్టీ నేతలు డిసైడ్అయినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా బస్సు యాత్ర రూట్ మ్యాప్నూ ఖరారు చేసినట్టు తెలిసింది.
కొండగట్టు నుంచి ప్రారంభించి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ రాహుల్, ప్రియాంకలు బస్సు యాత్ర చేసేలా రూట్మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కొండగట్టులో రాహుల్, ప్రియాంకలతోపాటు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి, స్థానిక నేతలతో పాటు మరికొందరు సీనియర్నేతలూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని తెలుస్తున్నది. ఇక, వారి టూర్ పూర్తికాగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆ తర్వాతి బస్సు యాత్రల్లో పాల్గొంటారని చెప్తున్నారు. జాతీయ స్థాయి నేతలు వరుసగా రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.