ఐటీ పార్కు.. ఏడిదాన్నే!
స్లోగా ఇండస్ట్రియల్ కారిడార్ పనులు
ఏడాదవుతున్నా పూర్తి కాని టవర్ నిర్మాణం
త్వరలోనే అందుబాటులో తెస్తామంటున్న మంత్రి
మహబూబ్ నగర్, వెలుగు: పాలమూరులో ఐటీ ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ పార్కు నిర్మాణం పనులు స్లోగా సాగుతున్నాయి. దివిటిపల్లి వద్ద సుమారు 400 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్కుకు మంత్రి కేటీఆర్ జులై 7, 2018న శంకుస్థాపన చేశారు. ఈ పార్కుతో పాలమూరు దశ తిరుగుతుందని, 15వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. హైదరాబాద్లో సుమారు 23 కంపెనీలతో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అంతేకాదు ఇక్కడే ఐటీ టవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నవంబర్ 1 2019న భూమి పూజ చేశారు. కానీ, పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పార్కు ప్లేస్లో నిర్వాసిత రైతులు పల్లీలు పండిస్తున్నారంటే పనులు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
దివిటిపల్లి వద్ద ఐటీ మల్టీపర్పస్ పార్కు
మహబూబ్నగర్ జిల్లాలో రూరల్ మండలం దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ ఇండస్ట్రీయల్ మల్టిపర్పస్ పార్కు రెండోది. గతంలో కాంగ్రెస్ హయాంలో జడ్చర్ల నియోజకవర్గంతో పోలేపల్లివద్ద సెజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫార్మా కంపెనీలకు అవకాశం ఇచ్చారు. కాగా ఐటీ కంపెనీలతో పాటు మల్టీ పర్పస్లో ఇతర కంపెనీలకు కూడా అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో చాలామందికి ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబాయి లాంటి మహనగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంప్లాయీస్ కూడా స్థానికంగా స్థిరపడొచ్చని ఆశలు పెట్టుకున్నారు.
హైటెక్ సిటీని పోలిన టవర్
దివిటిపల్లి ఐటీ పార్కులో రూ.28 కోట్లతో చేపట్టిన టవర్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి 2019 నవంబర్ 1న భూమి పూజ చేశారు. హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉండే టవర్ను పోలే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు. పనులు అట్టహాసంగా ప్రారంభించినా.. కరోనా ఎఫెక్ట్తో పనులు నిలిచిపోయాయి. తిరిగి ఈ మధ్యనే మళ్లీ షురు అయ్యాయి. పాలమూరు ఐటీపార్కు సమీపంలోనే విమానాశ్రయం ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్నారు. బైపాస్రోడ్డు, మెడికల్కాలేజీల ఏర్పాటుతో దివిటిపల్లి ఐటీకారిడార్కు మరింత కళ వచ్చింది. కానీ పనులు స్లోగా సాగడమే నిరుద్యోగులను కలవర పెడుతోంది.
ఐటీ కారిడార్తో నిరుద్యోగుల్లో ఆశలు
తెలంగాణ ఏర్పాటయ్యాక మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టే అతిపెద్ద ఐటీపార్కుకు బీజం పడింది. వలసల జిల్లాగా పేరున్న పాలమూరులో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమలు లేవు. జిల్లాల విభజన అయ్యాక కొత్తురు పారిశ్రామిక వాడ ఉమ్మడి జిల్లా నుంచి వీడిపోయింది. అక్కడక్కడ చిన్నచితక పరిశ్రమలు ఉన్నా… చాలావరకు మూతపడ్డాయి. కాగా పోలెపల్లిలో ఫార్మా పరిశ్రమలు ఉన్న స్థానికంగా ఉద్యోగఅవకాశాలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్ రాకతో నిరుద్యోగుల్లో ఆశలు
చిగురించాయి.
ఎదురు చూస్తున్నాం
జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో మెట్రో నగరాలకు వెళ్లి ఐటీ
కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ కారిడార్ పూర్తయితే మాకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నాం.
– ప్రవీణ్, ఇంజనీరింగ్ స్టూడెంట్, మహబూబ్ నగర్
అందుబాటులోకి తెస్తాం
దివిటిపల్లి ఐటీ కారిడార్ జిల్లాకు తలమానికం. గతంలో పాలించిన కాంగ్రెస్ నేతలు ఏం చేశారో మనందరికి తెలుసు. తెలంగాణ వచ్చాక పాలమూరులో ఐటీ కారిడార్కు పచ్చజెండా ఊపి సీఏం కేసీఆర్ రుణం తీర్చుకుంటుండు. హైటెక్ సిటీని పోలిన టవర్ను ఇక్కడ నిర్మిస్తున్నాం. త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
For More News..