- ఫార్మా కంపెనీపై ఐటీ రెయిడ్స్ .. రూ.7.5 కోట్లు సీజ్!
- కంపెనీ అకౌంటెంట్ల ఇండ్లు సహా 13 చోట్ల సోదాలు
- కంప్యూటర్లు, హార్డ్డిస్క్లు స్వాధీనం, అకౌంట్స్ ఫ్రీజ్!
- లావాదేవీలపై వివరణ కోరుతూ ఇద్దరు డైరెక్టర్లకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు:ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు ప్రదీప్రెడ్డి, కె.నరేంద్రరెడ్డి ఇండ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన రెయిడ్స్ మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగాయి. హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మొత్తం13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రెయిడ్స్లో ఎలాంటి లెక్కల్లో లేని రూ.7.5 కోట్లు సీజ్ చేసినట్లు సమాచారం. గచ్చిబౌలి మై హోమ్ బూజాలో నివాసం ఉంటున్న ప్రదీప్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడని సమాచారం.
రెండు రోజులు సోదాలు
ప్రదీప్రెడ్డి, నరేంద్రరెడ్డి ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో డైరెక్టర్స్ హోదాలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్తలతో కలిసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. ఎలక్షన్స్ నేపథ్యంలో వీరిద్దరి అకౌంట్స్లో పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఐటీ ఇంటెలిజెన్స్ యూనిట్ గుర్తించింది. ప్రదీప్ రెడ్డి, నరేంద్రరెడ్డి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తరలింపు జరుగుతున్నట్లు ఐటీకి సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి సోదాలు జరిపారు. గచ్చిబౌలిలోని మైహోమ్ బూజాతో పాటు వట్టినాగులపల్లి, రామచంద్రాపురం, అమీన్పూర్ పటేల్గూడ, మియాపూర్ సహా ఫార్మా కంపెనీకి చెందిన పలువులు అకౌంటెంట్ల ఇండ్లలో తనిఖీలు చేశారు.
5 నెలల లావాదేవీలపై ఐటీ ఆరా
రెయిడ్స్కు నాలుగు రోజుల ముందు నుంచి ప్రదీప్రెడ్డితో సంప్రదింపులు జరిపిన రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను కాల్డేటా ఆధారంగా పరిశీలించారు. ప్రదీప్ రెడ్డి ఐటీ రిటర్న్స్ తోపాటు కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ వివరాలు సేకరించారు. కంప్యూటర్ హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భారీ మొత్తంలో నగదును సీజ్చేసినట్లు తెలిసింది. అలాగే 5 నెలల ట్రాన్సాక్షన్స్ ఆధారాలతో ఐటీ ఆఫీసులో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.