హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ బంగారం షాపు యజమానుల ఇంట్లో, షాప్స్లో ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. 15 ఐటీ టీమ్స్ హైదరాబాద్ సిటీలో సోదాలు నిర్వహిస్తున్నాయి. బంగారం కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు, ట్యాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. సికింద్రాబాద్లోని బంగారం వ్యాపారి జగదీష్ ఇంట్లో రైడ్స్ జరిగాయి. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్లో తిరుపతి బులియన్ పేరుతో జగదీష్ వర్మ వ్యాపారాలు చేస్తున్నాడు. జగదీష్ వర్మ అన్న కొడుకు పవన్ వర్మ ఇంట్లో ఐటీ అధికారులు రైడ్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(ఏడీఈ) అంబేద్కర్ను మంగళవారం ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించింది. ఏడీఈ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
ఈ మేరకు ఏసీబీ డీజీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. గచ్చిబౌలికి చెందిన ఇరుగు అంబేద్కర్ టీజీఎస్పీడీసీఎల్ ఇబ్రహీంబాగ్ ఆపరేషన్స్ ఏడీఈగా పని చేస్తున్నాడు. ఏడీఈగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నాడని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. బాధితుల ఆధారంగా ఏసీబీ అధికారులు వివరాలు సేకరించి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. సెర్చ్ వారెంట్తో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు చేశారు. హైటెక్ సిటీ ఖానామెట్లోని మాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 307లోని అంబేద్కర్ ఇంటితోపాటు మెదక్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని పది ప్రాంతాల్లో ఆయ న బంధువుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు.
అంబేద్కర్ నివాసంలో కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. పటాన్చెరులోని అంబేద్కర్ బినామీగా ఉన్న అతని బంధువు సతీష్ ఇంట్లో రూ.2.18 కోట్ల నగదు, అంబేద్కర్ కారులో రూ. 5.50 లక్షలు క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో జీ ప్లస్ 5 భవనం, హైదరాబాద్లోని పలు కీలక ప్రాంతాల్లో ఆరు నివాస స్థలాల డాక్యుమెంట్లను సీజ్ చేశారు.
అంబేద్కర్ పేరిట పది ఎకరాల్లో అమ్తర్ పేరిట ఒక కెమికల్ కంపెనీ, నల్లగొండ జిల్లా పెన్పహాడ్లో వ్యవసాయ భూమి, రెండు కార్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.77 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.300 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
