లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ : కేసీ వేణుగోపాల్

లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ : కేసీ వేణుగోపాల్

ఢిల్లీలో గురువారం (డిసెంబర్ 21న) జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 76 మంది కీలక నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారని, నాలుగు గంటల పాటు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు ఘటన, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీలో పలు తీర్మానాలు చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది క్రితం తాము మూడో స్థానంలో ఉన్నామని, రాష్ర్టంలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశించామని,  కానీ ఓడిపోయామన్నారు.

మూడు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీకి నిరాశ కలిగించిందన్నారు కేసీ వేణుగోపాల్. ఎన్నికల ఫలితాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ చార్జులు వివరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో బలంగా ఉందని, తమ ఓటు శాతం పదిలంగా ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లడం తమకు ఆందోళన కలిగించడం లేదన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించామన్నారు. ఆలస్యం చేయకుండా లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపికకు ఈ నెలలోనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించారు.

లోక్ సభ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోందన్నారు. దేశాన్ని ఒకే పార్టీ పాలించాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోందని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షం ఉండకూడదని భావిస్తోందన్నారు. నియంతృత్వ పోకడతో ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ పార్టీ గెలుపు కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్- ఆధ్వర్యంలోని ఇండియా కూటమి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగపూర్ లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది ఒక గుర్తుండిపోయే కార్యక్రమం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఐదు నుంచి పది లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరవుతారని తెలిపారు.

అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఇప్పటికే వర్కింగ్ కమిటీలకు సూచించామన్నారు కేసీ వేణుగోపాల్. ఇండియా కూటమి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. గెలుపే లక్ష్యంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. రెండో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పడమరకు చేయాలని చాలామంది నేతలు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తున్నారని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర రెండో విడతపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. ఇండియా కూటమి పార్టీలతోని పొత్తు కోసం ఏఐసీసీ ఇప్పటికే ఒక కమిటీ వేసిందన్నారు. ఈ నెలలోనే పొత్తులపై చర్చలు ప్రారంభమవుతాయని చెప్పారు.

రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకొని ఇండియా కూటమి పార్టీలతోని పొత్తుల గురించి ఏఐసీసీ పొత్తుల కమిటీ చర్చిస్తుందన్నారు. ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం సూచించిన పేర్లను CWC పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తాము హాజరుకావడం విషయంపై స్పష్టత ఇవ్వలేదు.