
ది హేగ్ (నెదర్లాండ్స్): క్రికెట్ పసికూన ఇటలీ వచ్చే ఏడాది ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యేందుకు అడుగు దూరంలో నిలిచింది. టీ20 వరల్డ్ కప్ యూరప్ రీజియన్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో ఆ జట్టు.. తమకంటే ఎంతో బలమైన స్కాట్లాండ్కు షాకిచ్చింది. బుధవారం (జులై 09) జరిగిన ఈ పోరులో 12 రన్స్ తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది.
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ఇటలీ 20 ఓవర్లలో 167/6 స్కోరు చేసింది. ఎమిలో గయె (50), గ్రాంట్ స్టెవార్ట్ (44 నాటౌట్), హ్యారీ మనెటి (38) రాణించారు. అనంతరం ఛేజింగ్లో స్కాట్లాండ్ ఓవర్లన్నీ ఆడి 155/5 స్కోరు చేసి ఓడింది. ఓపెనర్ జార్జ్ మున్సే (72), కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (46 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. మనెటి (5/31) ఐదు వికెట్లతో ఆ టీమ్ను దెబ్బకొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలతో ఇటలీ 5 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. శుక్రవారం జరిగే గ్రూప్ చివరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో పోటీ పడనుంది. ఆ పోరులో గెలిస్తే ఇటలీ 2026 టీ20 వరల్డ్ కప్ బెర్తు దక్కించుకుంటుంది.