- 10 వికెట్ల తేడాతో నేపాల్ ఓటమి
- చెలరేగిన మోస్కా బ్రదర్స్
ముంబై: తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీ20 వరల్డ్ కప్కు క్వాలిఫై అయిన ఇటలీ.. చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. అంథోనీ మోస్కా (32 బాల్స్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 62 నాటౌట్), జస్టిన్ మోస్కా (44 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 60 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్కు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో.. గురువారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్లో ఇటలీ 10 వికెట్ల తేడాతో నేపాల్ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన ఇటలీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 రన్స్కే ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ (27) టాప్ స్కోరర్. తర్వాత ఇటలీ 12.4 ఓవర్లలోనే 124/0 స్కోరు చేసి నెగ్గింది. క్రిషాన్ కలుగమాగేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్పిన్నర్లు తిప్పేశారు..
ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ బ్యాటర్లను.. ఇటలీ స్పిన్నర్లు క్రిషాన్ కలుగమాగే (3/18), బెన్ మనెటీ (2/9) అడ్డుకున్నారు. రెండో ఓవర్లోనే కుశాల్ (5) ఔట్తో మొదలైన వికెట్ల పతనం చివరి వరకు ఆగలేదు. మధ్యలో ఆసిఫ్ షేక్ (20), రోహిత్ పౌడెల్ (23), దీపేంద్ర సింగ్ అరీ (17), ఆరిఫ్ షేక్ ఇన్నింగ్స్ను బాగు చేసే ప్రయత్నం చేశారు. ఈ ముగ్గురు కలిసి 85 రన్స్ జోడించారు. కరన్ కేసీ (17 నాటౌట్) నిలకడగా ఆడినా.. లోకేశ్ బామ్ (3), గుల్షన్ జా (3), నందన్ యాదవ్ (0), సందీప్ లామిచానె (5), లలిత్ రాజబాన్షి (0) వరుస విరామాల్లో ఔట్ కావడంతో నేపాల్ భారీ స్కోరు చేయలేకపోయింది.
ఇద్దరే దంచారు..
ఈ మ్యాచ్లో ఫేవరెట్గా దిగిన నేపాల్ బౌలర్లను మోస్కా బ్రదర్స్ ఉతికి ఆరేశారు. సిక్స్తో తొలి ఓవర్ను మొదలుపెట్టిన ఆంధోనీ తర్వాతి ఓవర్లో ఫోర్తో కుదురుకున్నాడు. అయితే మూడు, నాలుగో ఓవర్లలో జస్టిన్ 6, 4, 4, 4, 6 దంచాడు. ఇదే ఓవర్లో అంథోనీ కూడా సిక్స్ బాదాడు. తర్వాతి రెండు ఓవర్లలో 4, 6, 4 రావడంతో పవర్ప్లేలో ఇటలీ 68/0తో నిలిచింది. తర్వాత ఇద్దరు సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. 9వ ఓవర్లో అంథోనీ 6, జస్టిన్ 4 కొట్టడంతో ఫస్ట్ టెన్ ఓవర్స్లో ఇటలీ 97/0 స్కోరు చేసింది. ఈ క్రమంలో జస్టిన్ 37, అంథోనీ 28 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేశారు. తర్వాత సింగిల్స్ తీసినా జస్టిన్ ఓ భారీ సిక్స్తో ఇటలీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
నేపాల్: 19.3 ఓవర్లలో 123 (ఆరిఫ్ షేక్ 27, రోహిత్ 23, క్రిషాన్ 3/18). ఇటలీ: 12.4 ఓవర్లలో 124/0 (అంథోనీ 62*, జస్టిన్ 60*).
