
భద్రాచలం, వెలుగు: గిరిజన మహిళా సొసైటీలకే ఇసుక ర్యాంపులను అప్పగిస్తామని ఐటీడీఏ పీవో బి. రాహుల్ వెల్లడించారు. ఐటీడీఏ మీటింగ్హాలులో సోమవారం ఆయన గిరిజన మహిళా సొసైటీలతో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. మైనింగ్శాఖ సహకారంతో ఐటీడీఏ ఆర్థిక చేయూతనందించి గిరిజన మహిళల జీనవనోపాధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, బినామీలను నమ్మివారికి ఇసుక ర్యాంపులను అప్పగించొద్దని మహిళలకు సూచించారు. సొంతంగా ర్యాంపులను నిర్వహించుకునే శక్తి, సామర్థ్యాలను గిరిజన మహిళలు పెంచుకోవాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుల కింద రెండు ఇసుక ర్యాంపులను ఎంపిక చేసి ఒక్కో సొసైటీకి రూ.50 లక్షల రుణసాయం అందిస్తామని పేర్కొన్నారు.
గోదావరిలో ఇసుక పాయింట్లు గుర్తించి, టిప్పర్లు, ప్లానింగ్మిషన్ డోజర్లను అద్దెకు ఇప్పిస్తామన్నారు. అంతకు ముందు సొసైటీ సభ్యురాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను పీవో అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ల ద్వారా సొసైటీలకు రుణం, టెక్నికల్ హెల్ప్ ఇప్పిస్తామన్నారు. ఆదర్శవంతంగా నిర్వహించుకోవాలన్నారు. సమావేశంలో పీసా స్పెషల్ ఆఫీసర్ మనిధర్, టీజీఎండీసీ పీవో శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి అర్జీకి పరిష్కారం: పీవో
సుదూర అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ఆదివాసీల అర్జీలకు పరిష్కారం చూపించాలని యూనిట్ ఆఫీసర్లను పీవో రాహుల్ను ఆదేశించారు. ఐటీడీఏలో సోమవారం ఆయన గిరిజన దర్బారులో భాగంగా అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో ఉంచుకోవద్దని యూనిట్ ఆఫీసర్లకు సూచించారు. ప్రతి సంక్షేమ పథకం ఆదివాసీలకు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోడు భూములు, రైతుబంధు రుణాలు, భూ సమస్యలు, వ్యవసాయానికి కరెంటు,బోరు, మోటారు, మారుమూల గ్రామాల్లో మంచినీటి సౌకర్యం ఇతర సమస్యలతో అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను ఆన్లైన్ చేసి, ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిచడానికి కృషి చేస్తామని తెలిపారు.