
చేర్యాల,వెలుగు : చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం వాసవి గార్డెన్ లో జరిగిన జేఏసీ, అఖిలపక్ష సమావేశంలో రెవెన్యూ డివిజన్తో పాటు చేర్యాల మీదుగా రైల్వే మార్గం, నియోజకవర్గం పునరుద్ధరణ, ఇంటి పన్నుల తగ్గింపు, కోర్టు ఏర్పాటు తదితర అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
చేర్యాల ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ కోసం నాలుగు మండలాల్లోని గ్రామ పంచాయతీలు తీర్మానం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇందుకోసం అంచలంచెలుగా ఉద్యమం చేస్తామని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ, అఖిలపక్ష నేతలు పూర్మ ఆగంరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, మంచాల చిరంజీవులు, అందె అశోక్, అందె బీరయ్య, సిద్ధయ్య, దాసరి కళావతి, బుట్టి సత్యనారాయణ, బద్దిపడగ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.