
శామీర్ పేట, వెలుగు: రోడ్డు విస్తరణలో ఆస్తి కోల్పోతున్న కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీశ్గుప్తా డిమాండ్ చేశారు. ఆదివారం డి బ్లాక్ ఇన్చార్జి కాసుల ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో తూముకుంటలో భారీ ర్యాలీ తీసి రాస్తారోకో నిర్వహించారు. దుకాణదారులు షాపులను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
ఈ సందర్భంగా సతీశ్ గుప్తా మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణపై గతేడాది నుంచి హైకోర్టులో స్టే ఉన్నా ప్రభుత్వం విస్తరణకు అంత సిద్ధం అంటూ ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 200 ఫీట్ల విస్తరణను, 120 ఫీట్లకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కాసుల ఈశ్వర్ గౌడ్, దయాసాగర్, సూర్యప్రకాశ్రెడ్డి, సుభాష్ గౌడ్, మల్లేశ్గౌడ్, విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.