
బర్మింగ్హామ్: రెండో టెస్ట్లో ఇండియాకు భారీ స్కోరు అందించాలనే ఉద్దేశంతో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండో రోజు తోటి ప్లేయర్ల కంటే చాలా ముందుగా గ్రౌండ్కు వచ్చి ప్రాక్టీస్ చేశాడు. ఫలితంగా కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి 203 రన్స్ భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. దాంతో టీమిండియాకు ఏడో స్థానంలో తాను ఎంత ఉపయుక్తమైన బ్యాటరో జడ్డూ మరోసారి నిరూపించుకున్నాడు. డే స్టార్టింగ్లో పేసర్లు ఎక్కువగా షార్ట్ బాల్స్ ప్రయోగించినా జడేజా సమర్థవంతంగా ఫుట్ షాట్స్ కొట్టాడు. ‘బాల్ ఇంకా కొత్తగా ఉండటం వల్ల అదనంగా బ్యాటింగ్ చేయాలని నాకు అనిపించింది. బాల్ పాతబడితే మిగతా ఇన్నింగ్స్ ఆడటం చాలా సులభం అవుతుంది.
ఈ క్రమంలో నేను లంచ్ వరకు బ్యాటింగ్ చేయగలిగా. తర్వాత సుందర్ కూడా బాగా ఆడాడు. గిల్కు అవసరమైన సపోర్ట్ అందించాడు. ఇంగ్లండ్ పిచ్లపై ఎంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అంత మంచిది. బాల్ స్వింగ్ అయినా దాన్ని ఈజీగా ఎదుర్కొనే చాన్స్ ఉంటుంది’ అని జడేజా పేర్కొన్నాడు. భారీ భాగస్వామ్యం ఏర్పర్చడాన్ని తాను సవాల్గా తీసుకున్నానని చెప్పాడు. ఇది ఓ బ్యాటర్గా తనకు రాబోయే మ్యాచ్ల్లోనూ ఉపయోగపడుతుందన్నాడు. పదేపదే పిచ్ మధ్యలో పరుగెత్తడం వల్ల స్టోక్స్ నిరసన వ్యక్తం చేసినా.. వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించే ఉద్దేశం లేదని జడేజా స్పష్టం చేశాడు. పొరపాటున ఒకటి, రెండుసార్లు అలా పరుగెత్తి ఉండొచ్చన్నాడు.