
జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఇన్స్పైర్ అవార్డులకు నామినేషన్ల స్వీకరణ పోస్టర్ను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి స్కూల్ నుంచి 5 ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి పోటీలకు ఎంపికయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత కలిసికట్టుగా ముందడుగు వేయాలని, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వినియోగం, రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ఆఫీస్ లో ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడుతున్న యువతను కాపాడేందుకు పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీ రఘుచందర్, సీఐలు, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.