జగిత్యాల టౌన్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే) సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్, ఆర్టీసీ డిపోలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ కార్మికులు అనేక అవస్థలు పడ్డారన్నారు.
తమ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మూడు రోజుల్లోనే ముగింపు పలికి వారి సమస్యల పరిష్కరించామన్నారు. బాలల సంరక్షణే ధ్యేయంగా ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా చూసేందుకు ‘బాల భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, స్కూటీలు, ఇ–-ఆటో రిక్షాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజా, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
