
జమ్మికుంట, వెలుగు: సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము వడ్డీ చెల్లించడం లేదని ఆరోపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు.. కాంట్రాక్టర్ను మంగళవారం నిర్బంధించారు. బాధిత ఉద్యోగుల వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలోని ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్లో మూడేండ్ల కింద ఎలక్ట్రికల్ సివిల్ వర్కర్స్ కాంట్రాక్టర్ నరేంద్రచారికి రచ్చ సతీశ్, శ్రీపతి రమేశ్.. రూ.2లక్షల 3వేలు సెక్యురిటీ డిపాజిట్గా పెట్టి కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరారు. ఉద్యోగ కాలపరిమితి పూర్తయినందున సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకున్న ఆ మొత్తంతోపాటు వడ్డీ చెల్లించాల్సి ఉండగా.. వారికి అసలు మాత్రమే చెల్లించాడు.
బ్యాంకు ద్వారా వడ్డీ డబ్బులు వచ్చినా తమకు ఇవ్వకుండా నరేంద్రచారి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ మంగళవారం ఫ్యూజ్ ఆఫ్ ఆఫీసులో రూములో బంధించి తాళం వేశారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ నరేంద్ర చారి మాట్లాడుతూ తాను ఎవరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోలేదని తనకు కుటుంబ సమస్యలు ఉండడం వల్ల వారి వడ్డీ డబ్బులు చెల్లించడంలో జాప్యం జరిగిందని, బ్యాంకు ద్వారా రావలసిన డబ్బులను వారికి అందజేస్తానని తెలిపాడు.