60 రోజుల్లో.. అందరికీ ఆరోగ్యం.. జనగామ కలెక్టర్ కొత్త ప్రోగ్రాం

60 రోజుల్లో.. అందరికీ ఆరోగ్యం.. జనగామ కలెక్టర్ కొత్త ప్రోగ్రాం

జనగామ, వెలుగు: 60 రోజుల్లో 'టార్గెట్ ఆరోగ్య జనగామ' పేరుతో జనగామ కలెక్టర్​ రిజ్వాన్ భాషా షేక్ కొత్త ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మార్చి 2 నుంచి ఏప్రిల్​ 30 వరకూ రెగ్యులర్​గా హెల్త్, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. షుగర్​, బీపీ రహిత జిల్లా చేయాలన్న ఉద్దేశంతో ముందుగా యువతపై కలెక్టర్​ దృష్టి పెట్టారు. 30 ఏండ్లున్న ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్​ చేసే విధంగా ప్లాన్​ రూపొందించారు.ప్రతి గ్రామంలో గర్భిణులు, ఇతరులు కలిపి రోజుకు వంద మందికి స్క్రీనింగ్​ చేసి వారి హెల్త్​ ప్రొపైల్​ రూపొందిస్తారు.

హెల్త్ ప్రొఫ్రైల్​తో హెల్త్ కార్డు తయారు చేసి వారికి అందించనున్నారు. గుర్తించిన అనారోగ్యానికి సరైన ట్రీట్మెంట్ అందించడం ద్వారా భవిష్యత్ లో వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హెల్త్​ కార్డుతో ఏ హాస్పిటల్​కు వెళ్లినా డాక్టర్లకు పేషెంట్​ ఆరోగ్యంపై కొంత అవగాహన కూడా ఏర్పడి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో సత్వరమే నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. స్క్రీనింగ్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ఆహార నియమాలపై అవగాహన కల్పించనున్నారు.

‘ఆరోగ్య జనగామ’ ప్రోగ్రామ్​లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించనున్నారు. గ్రామాల్లో కొత్తగా పాలకవర్గాలు ఏర్పడడం, ఎక్కువగా యువత పాలకవర్గంలో ఉన్నారు. వారందరినీ ఈ ప్రోగ్రామ్​లో భాగస్వామ్యం కల్పించనున్నారు. పలు డిపార్ట్​మెంట్లను కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించే విధంగా ప్లాన్ రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వహిచిన మీటింగ్​లో ఆఫీసర్లకు కలెక్టర్​ రిజ్వాన్ భాషా షేక్​ సూచనలు, ఆదేశాలు  జారీ చేశారు.