- రూ. 7 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చిన ట్రిబ్యునల్
జనగామ, వెలుగు: జనగామలోని రుద్రమాదేవి మహిళా మాక్స్ సొసైటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సొసైటీ సీఈవో, అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఉద్యోగులు, డైరెక్టర్లతో కలిపి 22 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జనగామ టౌన్ సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. రూ.7,09,87,608 నిధులను దుర్వినియోగం చేసినట్లు ఇటీవల వరంగల్ కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ తేల్చగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీసీవో కోదండరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనరల్ బాడీ ఆమోదం లేకుండా జనగామ మండలం వడ్లకొండలో 38.21 ఎకరాల భూమిని కొనుగోలు, కమీషన్ల పేరుతో డబ్బులు రిలీజ్, రికార్డుల తారుమారు తదితర విషయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది.
సొసైటీ సీఈవో పి కవిత, అధ్యక్షురాలు బండి విజయలక్ష్మి, కార్యదర్శి గడ్డం విజయ లక్ష్మి, మాజీ సెక్రటరీ ఎం పద్మ, క్లర్క్ లు గుండెల్లి శ్రీనివాస్, సుంకరి దేవేందర్, చీఫ్ అడ్వైజర్ తల్క లక్ష్మణ్, వ్యవస్థాపక అధ్యక్షురాలు చిర్ర సుగుణమ్మ, మాజీ బ్రాంచ్ మేనేజర్ దేవర సుజాత, అకౌంటెంట్ కె కిశోర్, డ్రైవర్ ఎ సిద్దిలక్ష్మి, డైరెక్టర్లు కె ఉమాదేవి, వి శ్రీలత, గూడెపు విజయ, పుప్పాల రమాదేవి, కల్లెం లలిత, చుంచు జ్యోతి, పుప్పాల ఉమ, మాజీ డైరెక్టర్లు బి లక్ష్మి, రాయబారపు పద్మశ్రీ, గుండె తిరుమల, ఈ శారదపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
