పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి

పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి


తిరుపతి జిల్లా ఏర్పేడు మండంలం చిందేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. జనసేన నేత వినూత కోటా దీక్ష భగ్నం చేసేందుకు వెళ్లిన పోలీసులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. 

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి అయిన వినూత తన భర్త చంద్రబాబుతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష మూడవరోజుకు చేరుకుంది. చిందేపల్లి గ్రామంలో రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న లాంకో/ఈసీఎల్ సంస్థ కాంపౌండ్ వాల్ ను వ్యతిరేకిస్తూ వారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 

గోడ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. గోడ నిర్మిస్తే ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని గత వారం రోజులుగా చిందేపల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో వారి  దీక్ష భగ్నం చేసేందుకు వెళ్లిన పోలీసులపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు.