పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలి కలెక్టర్ రిజ్వాన్ భాషా

పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలి కలెక్టర్ రిజ్వాన్ భాషా

జనగామ అర్బన్, వెలుగు : పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎన్నికల నియమావళి పైన పూర్తి అవగాహన ఉండాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రిజ్వాన్​ భాషా తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ఎంపీడీవోలు, రిటర్నింగ్​ అధికారులు, అసిస్టెంట్​ రిటర్నింగ్​అధికారులకు ఎన్నికల నిబంధనల పై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్​లో ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఎలక్షన్​ ఆఫీసర్​ అడిషనల్​ కలెక్టర్ పింకేశ్​ కుమార్ తో కలిసి మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మాస్టర్​ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల విధులను ప్రతీ ఒక్కరూ సజావుగా నిర్వహించాలన్నారు. నామినేషన్​ స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణకి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఎన్నికల సంఘం నియమనిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు. జడ్పీ సీఈవో మాధురీ షా, డీఆర్డీవో వసంత, మాస్టర్​ట్రైనర్లు పాల్గొన్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి 

ములుగు: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ దివాకర అన్నారు. ములుగు కలెక్టరేట్ లో ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అడిషనల్​ కలెక్టర్​ సంపత్ రావు, ఆర్డీవో వెంకటేశ్, డీపీవో శ్రీధర్ లతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవీవోలతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఎన్నికలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 9 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కోర్టు ఆర్డర్​ ఉన్నందున మంగపేట మండలంలో ఎన్నికలు నిర్వహించడంలేదని తెలిపారు. 

అభ్యర్థులు ఎన్నికల నియమాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల వారీగా పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్డీవో సర్పంచ్​ అభ్యర్థులకు, ఎంపీడీవోలు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉంటారన్నారు. ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చామని, మరో దఫా శిక్షణ ఉంటుందన్నారు. మూడు విడతల్లో జరిగే జీపీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ప్రింటింగ్​ ప్రెస్, ఫ్లెక్సీల షాపుల నిర్వాహకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్​ వేర్వేరుగా సమావేశమై పలు సూచనలు చేశారు.