
మొదటి సినిమాతో అంతంతమాత్రంగా మార్కులు వేయించుకున్నా.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఒక్క క్షణం తీరిక లేకుండా అయిపోయింది జాన్వీ కపూర్. కార్గిల్ గాళ్, రూహీ అఫ్జా, దోస్తానా 2 చిత్రాలు చేస్తూనే ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్కి కూడా పని చేస్తోంది. రీసెంట్గా రిలీజైన ఈ సిరీస్ అందరినీ బాగానే భయపెట్టింది. ఇదిలా ఉంటే చాలా కాలంగా జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి రోజుకో వార్త బైటికొస్తోంది. అయితే అన్ని వార్తల సారాంశం ఒక్కటే. విజయ్ దేవరకొండ సినిమాతోనే ఆమె ఇక్కడ అడుగుపెడుతుందని. అది నిజమేనని పలువురు సినీ పెద్దలు కూడా అంటున్నారు. దీనికితోడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ నటిస్తున్న ‘ఫైటర్’తోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందనే వార్త బలంగా వినిపిస్తోంది. గతంలో తనకి విజయ్ అంటే ఇష్టమని జాన్వీ కూడా చెప్పడంతో ఈ వార్త నిజమేనని అందరూ అంటున్నారు. అయితే శ్రీదేవి కోరిక మేరకు అజిత్తో వరుస తమిళ చిత్రాలు తీస్తున్న బోనీ.. అజిత్ సినిమాలోని ఓ కీలక పాత్రతో జాన్వీని సౌత్కి ఇంట్రడ్యూస్ చేసి, ఆ తర్వాత తెలుగునాట అడుగు పెట్టిస్తారనే వార్తలూ వస్తున్నాయి. వీటిలో ఏది నిజమో తెలియదు కానీ.. శ్రీదేవి మీద ఉన్న అభిమానంతో జాన్వీ తెలుగులో నటించాలని కోరుకునేవారైతే చాలామందే ఉన్నారు. విజయ్తో కలిసి నటిస్తే అతనికున్న క్రేజ్ దృష్ట్యా మంచి ఎంట్రీ కూడా అవుతుంది. మరి జాన్వీ ‘ఫైటర్’తో జోడీ కడుతుందో లేదో చూడాలి.