
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో టెస్ట్ ఆడడంపై సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కు ముందు పని భారం కారణంగా మూడు టెస్టులో ఆడగలను అని తెలియజేసిన బుమ్రా చివరి రెండు టెస్టుల్లో ఏ టెస్ట్ మ్యాచ్ ఆడతాడో క్లారిటీ లేదు. ఇప్పటికే ఆడిన మూడు టెస్టుల్లో బుమ్రా.. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ కు దూరమయ్యాడు. తొలి టెస్టుతో పాటు లార్డ్స్ టెస్టులో బరిలోకి దిగాడు. ఒకవేళ బుమ్రా నాలుగో టెస్టులో ఆడకపోతే టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారుతుంది. అదే జరిగితే ఇప్పటికే 1-2 తో వెనకబడిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో బుమ్రా గుడ్ న్యూస్ చెప్పినట్టు సమాచారం. నాలుగో టెస్టులో ఆడతానని కన్ఫర్మ్ చేసినట్టు రెవ్స్స్పోర్ట్జ్ నివేదించింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బుమ్రా రాకతో టీమిండియాకు బిగ్ రిలీఫ్ లభించింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మాంచెస్టర్ వేదికగా ఈ నెల 23 నుంచి జరగబోయే నాలుగో టెస్టులో గిల్ సేన తప్పకుండా విజయం సాధించాల్సిన పరిస్థితి. బుమ్రా రాక భారత జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపనుంది. అదే సమయంలో మూడో టెస్టులో చేతి వేలికి గాయమైన రిషబ్ పంత్ బాగానే ఉన్నాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కన్ఫర్మ్ చేశాడు.
ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడాడు. లీడ్స్లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్హామ్లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు. లార్డ్స్లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. టీమ్ మేనేజ్మెంట్ తను ఎక్కువ స్పెల్స్ బౌలింగ్ చేయకుండా జాగ్రత్తపడుతోంది. ఓవరాల్ గా రెండు టెస్టుల్లో బుమ్రా 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో టెస్టు ముగిసిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఇండియా మాంచెస్టర్ మ్యాచ్ కోసం గురువారం బెకెన్హామ్ కౌంటీ గ్రౌండ్లో శిక్షణ ప్రారంభించింది.