
జీడిమెట్ల, వెలుగు: చైనా మాంజా దారం మెడకు తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందాడు. శనివారం రాత్రి హైదరాబాద్లోని లంగర్హౌస్ ఫ్లైఓవర్ పై ఈ ఘటన జరిగింది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెద్ద వాల్తేరుకు చెందిన ఆర్మీ జవాన్ (నాయక్) కోటేశ్వర్ రెడ్డి (30) ఐదు నెలల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బదిలీపై వచ్చాడు. పది రోజుల క్రితం లంగర్హౌస్లోని బాపూ ఘాట్లో ఇల్లు రెంట్కు తీసుకొని ఉంటున్నాడు.
రోజు మాదిరిగానే శనివారం రాత్రి 7:20 గంటల ప్రాంతంలో టూ వీలర్పై డ్యూటీకి బయలుదేరాడు. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తుండగా కైట్ తెగిపడి దానికి ఉన్న చైనా మాంజా దారం అతని మెడకు కోసుకుపోయి తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అతన్ని లంగర్ హౌస్ పక్కనే ఉన్న మిలటరీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆర్మీ అధికారులు కోటేశ్వర్రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం డెడ్బాడీని అతని సొంతూరికి పంపించారు. కోటేశ్వర్రెడ్డి దంపతులకు 9 నెలల పాప ఉందని పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ వారం పది రోజులు నెమ్మదిగా వెళ్లాలని, తెగిపడిన మాంజా దారం కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి తీసేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. కోటేశ్వర్ రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.
కైట్ ఎగరేస్తూ బిల్డింగ్పై నుంచి పడి ఏఎస్ఐ కొడుకు మృతి..
కైట్ ఎగరేస్తూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్పై నుంచి పడి మృతిచెందాడు. హైదరాబాద్ పేట్బషీరాబాద్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. నార్త్ ఎన్సీఎల్లో నివాసముండే రాగం రాజశేఖర్అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఇతని చిన్న కొడుకు ఆకాశ్(20) లయోలా కాలేజీలో డిగ్రీ సెకండ్ఇయర్ చదువుతున్నాడు. సంకాంత్రి పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నార్త్ ఎన్సీఎల్ కాలనీలో వారు ఉండే అపార్ట్మెంట్పైకి తన అన్న ఆదిత్య, ఇతర మిత్రులతో కలిసి వెళ్లి కైట్స్ ఎగరేస్తున్నాడు.
ఈ క్రమంలో చరక అపార్ట్మెంట్ పై అంతస్తుపై ఉన్న ప్లాస్టిక్ షీట్పై పడింది. దానిని తీసుకునే ప్రయత్నంలో ప్లాస్టిక్ షీట్పై ఆకాశ్ కాలు పెట్టగా.. అది విరిగి ఐదో అంతస్తు నుంచి మొదటి అంతస్తు పై పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పతంగి ఎగరేస్తుండగా కరెంట్షాక్.. వ్యక్తి మృతి
జోగిపేట, వెలుగు: పతంగి ఎగరేస్తూ కరెంట్షాక్కు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట టౌన్లో జరిగింది. జోగిపేటకు చెందిన బండల ప్రసాద్కు ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు చాముండేశ్వరీదేవిని రెండేండ్ల క్రితం కృష్ణా జిల్లా కొరగంటెపాలెంనకు చెందిన సుబ్రమణ్యం(35)కు ఇచ్చి పెండ్లి చేశాడు. అతడు పటాన్చెరు సమీపంలోని ఇస్నాపూర్లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పండుగకు దంపతులిద్దరూ జోగిపేటకు వచ్చారు. శనివారం రాత్రి కొడుకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
ఆదివారం ఉదయం సుబ్రమణ్యం బంగ్లాపై పతంగి ఎగురవేస్తుండగా.. అది ఇంటికి పక్కనే ఉండే హైటెన్షన్ విద్యుత్ వైర్ల మధ్యన చిక్కుకుంది. దానిని తీసే ప్రయత్నంలో సుబ్రమణ్యం కరెంట్ షాక్కు గురయ్యాడు. గమనించిన భార్య ఆయనను విడిపించే ప్రయత్నం చేయగా ఆమె చేతులూ కాలాయి. అక్కడే ఉన్న ఆమె అక్క కూతురుకూ స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సుబ్రమణ్యం బంగ్లాపై నుంచి కింద పడగా.. తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
గొంతుకు గాయం
కోరుట్ల, వెలుగు: బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తికి చైనా మాంజా దారం తగిలి గొంతుకు గాయమైంది. మెట్ పల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన బట్టు శంకర్ ఆదివారం సాయంత్రం కోరుట్లకు బైక్పై బయలుదేరాడు. అల్లమయ్యగుట్ట వైపు వెళ్తుండగా ఫిల్టర్ బెడ్ వద్ద అకస్మాత్తుగా చైనా మాంజా దారం అతని గొంతుకు తగిలింది. స్వల్పంగా గాయపడిన అతను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు.