సైన్యంలో చేరాలనేది ఆమె చిన్పప్పటి కల. అనుకున్నట్టుగానే నాలుగేండ్ల క్రితం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేరి తన కలని నిజం చేసుకుంది. అంతటితోనే ఆమె ఆగిపోలేదు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిస్క్తో కూడిన బైక్ స్టంట్స్ కూడా నేర్చుకుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో మొదటిసారి బైక్ స్టంట్స్ చేయబోతోంది పి. జయంతి. ‘సీమా భవానీ’ గ్రూప్లో మెంబర్ అయిన ఆమె సొంతూరు కేరళలోని కొల్లాం.
బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది జయంతి. ఢిల్లీలోని రాజ్పథ్లో రిపబ్లిక్ డే సందర్భంగా మహిళా సైనికులతో కూడిన ‘సీమా భవానీ’ గ్రూప్ బైక్ స్టంట్స్ చూసి ఇన్స్పైర్ అయింది. తను కూడా బుల్లెట్ బండి మీద దూసుకెళ్తూ అబ్బుర పరిచే విన్యాసాలు చేయాలనుకుంది. అందుకోసం ‘సీమా భవానీ’ గ్రూప్లో చేరింది. బుల్లెట్ బండి నడపడం, బండి మీద వెళ్తూ ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ చేయడంలో ఏడు నెలలు ట్రైనింగ్ తీసుకుంది. ఈ గ్రూప్లోని110 మందిలో జయంతి ఒకరు. జయంతి భర్త కూడా బీఎస్ఎఫ్లోనే ఇన్స్పెక్టర్.
‘సీమా భవాని’ సాహసం
బీఎస్ఎఫ్లో ‘సీమా భవాని’ టీమ్ని 2016లో ఏర్పాటుచేశారు. 2018 రిపబ్లిక్ డే వేడుకల్లో బైక్ స్టంట్స్ చేశారు ఈ టీమ్ మెంబర్స్. బుల్లెట్ బండి మీద ‘పిరమిడ్ స్టంట్స్’తో పాటు ‘శక్తిమాన్’, ‘ఫిష్ రైడింగ్’, ‘బుల్ ఫైటింగ్’, ‘సీమ ప్రహరి’... ఇలా 16 రకాల విన్యాసాలతో అబ్బురపరుస్తారు వీళ్లు. రిస్క్తో కూడిన ఈ స్టంట్స్ చేసేందుకు చాలా కష్ట పడతారు. పొద్దున్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ సాయంత్రం 3:30 నుంచి 5:30 వరకు బైక్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తారు. వీళ్లకో కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. పరేడ్ జరుగుతున్నప్పుడు టీమ్లోని వాళ్లతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కోడ్ లాంగ్వేజ్తోనే చెప్తారు. దాంతో చిన్న పొరపాటు కూడా జరగకుండా స్టంట్స్ కంప్లీట్ చేస్తారు.