- రూ.10 లక్షల ఆస్తి నష్టం
మొగుళ్లపల్లి, వెలుగు: ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో ఏడెకరాల్లో ఆయిల్ పామ్ తోట దగ్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పామాయిల్ తోటతో పాటు డ్రిప్ పైపులు, ఇతర వ్యవసాయ సామగ్రి పూర్తిగా దగ్ధమై సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు పోలినేని లింగారావు తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తులు పంట పొలాల్లో నిప్పంటించడంతో, ఈదురుగాలులకు ఆ నిప్పురవ్వలు తమ తోటకు అంటుకొని ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. అధికారులు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
