మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కష్టపడటమే కాకుండా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నగరంలోని బోయపల్లి వైటిసి బిల్డింగ్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 150 మంది పదవ తరగతి విద్యార్థులకు ఐఐఐటీ సీటు సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించడానికి క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు.
విజయాన్ని సాధించాలంటే పట్టుదలతో చదవడం, లక్ష్యసాధన పట్ల నిబద్ధత కలిగి ఉండటం చాలా అవసరమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒక మంచి ప్రయోగాన్ని ప్రారంభించారని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, కార్పొరేటర్లు ఎస్వీఎస్ సంస్థ సభ్యులు కె.జి. రెడ్డి, కె.కె. రెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, పాల్గొన్నారు.
