హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ 2023 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. పరీక్షను వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహిస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. ఈ మేరకు గురువారం షెడ్యూల్ ను, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్ లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకూ https://jeeadv.ac.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు మే 5 లోగా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్- 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. జూన్ 18న ఫైనల్ కీ తో పాటు ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ జనవరి 24, 25, 27, 29, 29, 30, 31వ తేదీల్లో జరగనుండగా, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ తదితర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే పలు రాష్ట్రాల్లో సీబీఎస్ఈ 12 వ తరగతి బోర్డు ప్రాక్టకిల్స్ జనవరిలో ఉండడంతో జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ పరీక్షను వాయిదా వేయాలని పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
2.50 లక్షల మందికి దరఖాస్తుకు అవకాశం..
జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వారిలో రెండున్నర లక్షల మంది అడ్వాన్స్డ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఏటా పది లక్షల మంది వరకు మెయిన్ ఎగ్జామ్స్ రాస్తున్నా, అడ్వాన్స్డ్ మాత్రం రెండు లక్షల లోపు మందే అప్లై చేస్తున్నారు. ఓపెన్ క్యాటగిరిలో 1,01,250 మంది, ఈడబ్ల్యూఎస్లో 25 వేలు, ఓబీసీలో 67,500, ఎస్సీ క్యాటగిరిలో 37,500, ఎస్టీల్లో 18,750 మందికి అవకాశం కల్పించనున్నారు. అయితే అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయినా... ఇంటర్/ 12వ తరగతిలో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాటగిరి స్టూడెంట్లు 65 శాతం, మిగిలిన స్టూడెంట్లు 75 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.