రెండో తండ్రికి పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్తుందని తల్లిపై కోపం.. అంజలి హత్య కేసులో సంచలన విషయాలు

రెండో తండ్రికి పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్తుందని తల్లిపై కోపం.. అంజలి హత్య కేసులో సంచలన విషయాలు
  • అమ్మను చంపకపోతే.. నేను సూసైడ్ చేసుకుంటా!
  • హత్యకు ముందు శివకుమార్ కు అంజలి కూతురు బెదిరింపులు  
  • రెండో తండ్రికి పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్తుందని తల్లిపై కోపం
  • తన ప్రేమకు అడ్డురావడంతో మరింత పగ
  • అంజలి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

జీడిమెట్ల, వెలుగు: ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి చదివే కూతురు ప్రియుడితో కలిసి హత్యచేయించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన తల్లిని చంపకపోతే.. తాను సూసైడ్​ చేసుకుంటానని బాలిక తన ప్రియుడిని బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కూతురితో పాటు అమె ప్రియుడు శివకుమార్, అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్​ చేసి.. ఇద్దరు మైనర్లను జువైనల్​హోమ్​కు రిమాండ్​కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్​ డీసీపీ సురేశ్​కుమార్​ ​బుధవారం మీడియాకు వెల్లడించారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్​నగర్ న్యూ ఎల్బీనగర్​కు చెందిన అంజలి(39)కి ఇద్దరు కూతుర్లు. అంజలి మొదటి భర్తకు పెద్ద కూతురు(15) జన్మించగా, రెండో భర్తకు చిన్నకూతురు(13) జన్మించింది. మొదటి భర్త చనిపోవడంతో అంజలి రెండో పెండ్లి చేసుకుంది. రెండో భర్త సైతం ఏడాది క్రితం యాక్సిడెంట్​లో చనిపోయాడు. దీంతో ఇద్దరు కూతుర్లను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంలో కళాకారిణిగా అంజలి జీవనం సాగిస్తున్నది.

ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న పెద్ద కూతురుకు ఇన్​స్టాగ్రామ్​ ద్వారా 8నెలల క్రితం నల్గొండ జిల్లా కట్టంగూర్ కు చెందిన ఇంటర్ సెకండియర్​ ​చదువుతూ డీజే ఆపరేటర్​గా పనిచేస్తున్న శివకుమార్​(19)తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటంబాలకు తెలిసింది. దీంతో శివకుమార్ తరచూ ​అంజలి ఇంటికి వచ్చి వెళ్లే వాడు. ముందు వారి ప్రేమను ఒప్పుకున్న అంజలి ఓ రోజు సడన్​గా వారి ప్రేమకు అడ్డు చెప్పింది.

అయినప్పటికీ వారిద్దరూ ఒకరినొకరు కలుస్తుండేవారు. ఈ నెల 8 నుంచి 12 వరకు ఆమె కూతుర్లు ఇద్దరు కట్టంగూర్ కు వెళ్లి శివకుమార్​ఇంట్లో ఉన్నారు. విషయం తెలిసిన తల్లి ఎందుకు వెళ్లారంటూ పెద్దకూతురును తీవ్రంగా కొట్టింది. మళ్లీ ఈ నెల 18న పెద్దకూతురు ఇంట్లో ఉన్న కొంత నగదు, బంగారం తీసుకొని శివకుమార్​తో  చుండూర్​కి వెళ్లింది. దీంతో అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్​ కేసు నమోదు చేసి అమ్మాయిని  ట్రేస్​ చేసి 20న తల్లికి అప్పగించారు. అలాగే, మంగళవారం బాలికకు వైద్య పరీక్షలు చేయించి, శివను కోర్టులో హాజరుపరచాల్సి ఉంది.

ముందు అంగీకరించి.. తర్వాత అడ్డుపడడంతో పగ 
తల్లి తన ప్రేమను ముందు అంగీకరించి.. తర్వాత అడ్డుపడటం, మొదటి భర్తకు పుట్టిన తనపై కాకుండా రెండో భర్తకు పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్తూ తనని హింసిస్తుందని పెద్దమ్మాయి భావించింది. తాను తల్లి వద్ద ఉండనని ఏడో తరగతి చదువుతున్నప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందరూ నచ్చచెప్పడంతో తల్లి వద్దనే ఉంటుంది. కానీ, తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేక పోయింది. అన్ని విధాలా అడ్డువస్తున్న తల్లిని అంతంచేయడమే సమస్యకు పరిష్కారమని భావించింది. ఇదే విషయాన్ని శివకు చెప్పింది. ఇందుకు శివ మొదట ఒప్పుకోలేదు.

దీంతో ‘‘నా తల్లిని చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుని దానికి నువ్వే కారణమని లెటర్​రాస్తా”అని  బెదిరించింది. దీంతో శివ, ఇంటర్​ ఫస్టియర్​ చదువుతున్న తన తమ్ముడు (16)తో కలిసి సోమవారం రాత్రి షాపూర్​నగర్ కు వచ్చి అంజలిని కిరాతకంగా చంపేశారు. ఇప్పటికే తండ్రి మృతిచెందడం, తల్లిని అక్క హత్య చేయించడంతో అంజలి రెండో కూతురు అనాథగా మిగిలిపోయింది. ఆమె దయనీయ స్థితిపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అంజలిని చంపడం కరెక్టే: శివ తల్లి
అంజలిని తన కుమారులు చంపడం కరెక్టేనని శివ తల్లి పేర్కొంది. బుధవారం ఆమె కట్టంగూర్ లో మీడియాతో మాట్లాడింది. ఇందులో తన పిల్లలది, తనది ఏ తప్పులేదని, తప్పంతా అమ్మాయిది, వాళ్ల అమ్మదేనని తెలిపింది. ముందే అమ్మాయి తిరగకుండా కట్టడి చేయాల్సిందని అభిప్రాయపడింది. అంతా జరిగాక అమ్మాయిని భయపెట్టడం సరికాదని పేర్కొంది. ఇద్దరు కొడుకులు కేసులో ఉంటే తనకు టెన్షన్​ ఏమి లేదని, ఈ రోజు కాకపోతే రేపు తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.