కమీషన్లకు కక్కుర్తి పడ్డావు.. అడ్డగోలుగా విద్యుత్తు ప్లాంట్లు పెట్టించావు : జీవన్ రెడ్డి

కమీషన్లకు కక్కుర్తి పడ్డావు..  అడ్డగోలుగా విద్యుత్తు ప్లాంట్లు పెట్టించావు : జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: విద్యుత్తు కొనుగోళ్లపై వస్తున్న ఆరోపణలు చూస్తే ఎంత దోపిడీ జరిగిందో స్పష్టమవుతోందని కాంగ్రెస్  నేత, ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి మాజీ సీఎం కేసీఆర్  అడ్డగోలుగా విద్యుత్  ప్లాంట్లను పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. సోలార్, విండ్  ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుండా అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేశారని ఫైర్  అయ్యారు. 

చత్తీస్ గఢ్  నుంచి చేసిన విద్యుత్  కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్  ప్లాంట్  టెండర్లలోనూ అక్రమాలే జరిగాయన్నారు. ‘‘యాదాద్రి పవర్  ప్రాజెక్టు రాష్ట్రానికి గుడిబండగా మారబోతుందని గతంలో అసెంబ్లీలో బీఆర్‌‌ఎస్  సర్కార్ ను మేము హెచ్చరించినా కేసీఆర్  మా మాట వినలేదు. బొగ్గు ఉత్పత్తి అయ్యే చోట పవర్ ప్లాంట్ పెట్టాలి. కానీ, దామరచర్లలో విద్యుత్ ప్లాంట్  ఎలా పెట్టారు? మెడమీద తలకాయ ఉన్నోడు ఎవ్వడు కూడా అలాంటి నిర్ణయం తీసుకోడు. 

విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవినీతి కేసీఆర్  మెడకు చుట్టుకుంటుందని తెలిసే, దీన్ని పక్కదారి పట్టించడానికి హరీశ్.. టీజీపీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నాడు. కాంగ్రెస్  ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదు. అందుకే బీఆర్ఎస్  నేతలు అడ్డుకుంటున్నరు?” అని జీవన్  రెడ్డి అన్నారు.