హైదరాబాద్, వెలుగు : సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానికి వాడుకోవాలని చూస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జెన్కో, ట్రాన్స్కోలు సింగరేణికి రూ.20 వేల కోట్లు బకాయి పడ్డాయ న్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 బ్యాంక్ బాండ్స్తో సింగరేణి లాభాల్లో ఉండగా.. ఇప్పుడు బకాయిలు రాక కష్టాల్లో కూరుకుపోయిందని, సింగరేణి జీతాల బకాయిలే 23 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి లాభాలు రూ.2200 కోట్లలో కార్మికులకు వారి వాటా కింద రూ.750 కోట్లు రావాల్సి ఉందన్నారు. సింగరేణిలో రాష్ట్రం వచ్చినప్పుడు 65 వేల మంది కార్మికులు పనిచేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 42 వేలకు పడిపోయిందని గుర్తు చేశారు. కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్ని కార్మికుల శ్రమను వాడుకుంటున్నదని మండిపడ్డారు. 33 జిల్లాల్లో ప్రభుత్వ నిధులతోనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం.. రామగుండంలో పెట్టే కాలేజీకి మాత్రం సింగరేణి నుంచి నిధులను తీసుకుంటున్నదని విమర్శించారు.