న్యూఢిల్లీ: అవినీతి, మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ మాజీ బాస్ నరేష్ గోయల్ కుటుంబానికి సంబంధించిన రూ. 538.05 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. అటాచ్ చేసిన ఆస్తులలో 17 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, బంగ్లాలు, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. లండన్, దుబాయ్తో పాటు భారతదేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ఈ ఆస్తులు జెట్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్, జెట్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, గోయల్, ఆయన భార్య అనిత, కొడుకు నివాన్, వివిధ కంపెనీల పేరు మీద ఉన్నాయని ఈ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబరులో గోయల్ను అరెస్టు చేసిన ఈడీ, ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో పీఎంఎల్ఏ చట్టం ప్రకారం చార్జ్షీట్ దాఖలు చేసింది. మోసం కేసుకు సంబంధించి జెట్ ఎయిర్వేస్, గోయల్, అనిత, కొంతమంది కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్లపై సీబీఐ మనీలాండరింగ్ కేసు పెట్టింది. జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్కు రూ. 848.86 కోట్లకు వరకు క్రెడిట్ లిమిట్స్, లోన్లు ఇచ్చామని, ఇందులో రూ. 538.62 కోట్లు తిరిగి చెల్లించలేదంటూ బ్యాంక్ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
గోయల్ విదేశాలలో వివిధ ట్రస్టులను సృష్టించడం ద్వారా భారతదేశం నుంచి విదేశాలకు డబ్బును అక్రమంగా పంపించారని సీబీఐ తెలిపింది. గోయల్ ముంబైలో అధిక విలువ కలిగిన ఆస్తులను కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని విక్రయించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. నిందితుడు భారతదేశంలోని ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసి స్థిరాస్తులను సంపాదించాడని, నివాస సిబ్బందికి జీతాలు, ఆయన కుమార్తె నిర్మాణ సంస్థ నిర్వహణ ఖర్చులు కూడా జేఐఎల్ ఖాతాల నుంచి చెల్లించాడని సీబీఐ పేర్కొంది.