
Rekha Jhunjhunwala: వరుసగా రెండు రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు పతనంలో ఉన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే నేడు తమ ప్రయాణాన్ని ముగించి బ్లాక్ ఫ్రైడే నష్టాలను మిగిల్చాయి.
అయితే మార్కెట్ల గందరగోళ పరిస్థితుల్లో సైతం రేఖా జున్జున్వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ షేర్లు మాత్రం మెరిశాయి. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు దాదాపు 8 శాతం పెరిగి ఒక్కోటి రూ.వెయ్యి 340 స్థాయికి చేరుకున్నాయి. అయితే చివరికి షేర్ ఒక్కోటి రూ.వెయ్యి 327 వద్ద స్థిరపడింది. అయితే దీనివెనుక పెద్ద కారణం ఉన్నట్లుగా తేలింది. అదేంటంటే నేడు జరిగిన బ్లాక్ డీల్ లో రేఖా జున్జున్వాలా తన దివంగత భర్త వాటాలను తగ్గించినట్లు వెల్లడైంది.
సమాచారం ప్రకారం గేమింగ్ కంపెనీలో జున్జున్వాలా రెండు రోజుల కిందట 12 లక్షల 36వేల 500 షేర్లను అమ్మేశారు. అలాగే దీనికి ముందు జూన్ 2 నుంచి 6 మధ్య కాలంలో అంటే గతవారం దాదాపు 17లక్షల 38వేల 500 షేర్లను అమ్మేశారని వెల్లడైంది. దీంతో ప్రస్తుతం వారికి గేమింగ్ కంపెనీలో 32 లక్షల షేర్ల వరకు ఉన్నట్లు వెల్లడైంది.
►ALSO READ | LIC News: విమాన ప్రమాదంపై రంగంలోకి ఎల్ఐసీ.. కీలక ప్రకటన..
నిన్న నజారా టెక్నాలజీస్ అమెరికాలోని తన అనుబంధ సంస్థ కర్వ్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ను సుమారు రూ.223 కోట్లు వెచ్చించి100 శాతం వాటాల కొనుగోలును పూర్తి చేసిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలతో కంపెనీ షేర్లు భారీగా లాభపడ్డాయి. గడచిన నెల రోజుల్లో ఏకంగా 11 శాతానికి పైగా పెరగగా.. ఆరు నెలల కాలంలో 32 శాతం వరకు లాభపడింది. ఇక ఏడాది రాబడిని చూస్తే 50 శాతానికి పైగానే ఉండటంతో ప్రస్తుతం ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.