జియో స్టార్ పెట్టుబడి రూ.86 వేల కోట్లు..

జియో స్టార్ పెట్టుబడి రూ.86 వేల కోట్లు..

న్యూఢిల్లీ: వయాకామ్‌‌18, స్టార్ ఇండియాల జాయింట్ వెంచర్‌‌ జియోస్టార్  2024–2026 మధ్య  కంటెంట్ క్రియేట్ చేయడానికి  10 బిలియన్‌‌ డాలర్ల (రూ.86 వేల కోట్ల) కు పైగా ఇన్వెస్ట్ చేస్తుందని సంస్థ  వైస్ -చైర్మన్ ఉదయ్ శంకర్ 2025  వేవ్స్‌‌ సమ్మిట్‌‌లో పేర్కొన్నారు.  ఇందులో 2024లో రూ.25 వేల కోట్లు ఇన్వెస్ట్ చేశామని, ఈ ఏడాది మరో  రూ.30 వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.32 వేలు–33 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని వివరించారు.  క్రీడలు, వినోదం, టెలివిజన్ వంటి విభాగాల్లో ఈ పెట్టుబడులను కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది. పైన పేర్కొన్న 10 బిలియన్ డాలర్లలో 8.5 బిలియన్ డాలర్ల (రూ.73 వేల కోట్ల) ను లోకల్‌‌ కంటెంట్‌‌ను క్రియేట్‌‌ చేయడానికి ఖర్చు చేస్తామని ఉదయ్ శంకర్‌‌‌‌ అన్నారు.

భారతదేశ వైవిధ్యం,  సంస్కృతిని ప్రతిబింబించేలా  కంటెంట్ ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.  జియోసినిమా, డిస్నీ+ హాట్‌‌స్టార్ విలీనం ద్వారా ఏర్పడిన జియోస్టార్ 28 కోట్ల మంది సబ్‌‌స్క్రయిబర్లను సాధించింది.  త్వరలో ఈ నెంబర్‌‌‌‌ను 30 కోట్లకు పెంచుకోవాలని టార్గెట్‌‌  పెట్టుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌‌ను ప్రసారం చేస్తున్న జియోస్టార్‌‌‌‌, ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌‌లో  20 లక్షలకు పైగా పెయిడ్‌‌ సబ్‌‌స్క్రయిబర్లను సాధించింది. ఇండియాలో కస్టమర్లను పొందాలంటే తక్కువ రేట్లకు  సర్వీస్‌‌లను అందించడం ముఖ్యమని,  గత 30 ఏళ్లుగా  శాటిలైట్ ప్రసారాలు విజయం సాధించడానికి ఇదే కారణమని శంకర్‌‌‌‌ తెలిపారు. 

ఈ సవాళ్లు..
‘‘క్రియేటివిటీ   ఉన్న రైటర్లు, యాక్టర్లు, నిర్మాతల  కొరత ఉంది.  హిందీ చిత్ర పరిశ్రమ 60 ఏళ్లకు పైబడిన వారితో నిండిపోయింది.  అయితే దక్షిణ భారతీయ సినిమా (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) లో క్రియేటివిటీ కనిపిస్తోంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి”అని  శంకర్ హైలైట్ చేశారు.  మరోవైపు యూట్యూబ్ కూడా  రాబోయే రెండేండ్లలో  రూ.850 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ఇండియా కంటెంట్ క్రియేటర్లు, మీడియా కంపెనీలకు  గత మూడేళ్లలో  రూ.21,000 కోట్లకు పైగా చెల్లించామని కంపెనీ  సీఈఓ నీల్ మోహన్ పేర్కొన్నారు.