- ప్లాంట్ జనరల్ మేనేజర్కు జమ్మూకాశ్మీర్ పోలీసుల లేఖ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో పని చేస్తున్న 29 మంది వర్కర్లకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కార్మికులు జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. ఈ మేరకు పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ కు నవంబర్ 1న పోలీసులు లేఖ రాశారు. ద్రబ్ షల్లాలోని చీనాబ్ నదిపై 850 మెగావాట్ల సామర్థ్యంతో రాటిల్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విద్యుత్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న 29 మంది వర్కర్లకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు లేఖ రాశారు. 25 మంది వర్కర్లపై కిష్త్వార్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. మరో ఇద్దరి కార్మికులకు చెందిన తండ్రి ఓవర్ గ్రౌండ్ వర్కర్గా పని చేస్తున్నారని వివరించారు. ఆయన టెర్రరిస్టులకు లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తున్నారని చెప్పారు. ఇతర ఉద్యోగులకూ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిపారు.
వ్యూహాత్మక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ విద్యుత్ ప్రాజెక్టు శత్రు దేశాలకు లక్ష్యంగా మారిందన్నారు. టెర్రరిస్టులతో సంబంధాలు, నేరచరిత్ర ఉన్న వారిని పనిలో పెట్టుకోవడం వల్ల విద్యుత్ ప్రాజెక్టు భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
