5 వేల 89 పోస్టులతో డీఎస్సీ.. నోటిఫికేషన్ రిలీజ్

5 వేల 89 పోస్టులతో డీఎస్సీ.. నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్​జీటీ, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అభ్యర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 దాకా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలను వెల్లడించారు. 

ఆన్​లైన్ ఎగ్జామ్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, జిల్లాల వారీగా కమ్యూనిటీ, మీడియం వారీగా ఖాళీలను ఈ నెల15న www.schooledu.telangana.gov.in లో పెడ్తామని నోటిఫికేషన్​లో అధికారులు వెల్లడించారు. సమాచార బులెటిన్ 20 నుంచి వెబ్ సైట్​లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.

44 ఏండ్ల దాకా అర్హులే..

18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వరకు ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు మరో ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేండ్లు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు రెగ్యులర్ సర్వీస్ కాలంపై ఆధారపడి ఐదేండ్ల వరకు సడలింపు ఉండనుంది.

ఐదింతలు పెరిగిన అప్లికేషన్ ఫీజు

అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. రెండు సబ్జెక్టులకు పరీక్ష రాస్తే.. రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2017 టీఆర్టీ నోటిఫికేషన్​లో టీఎస్​పీఎస్సీ రూ.200 మాత్రమే ఫీజు తీసుకోగా, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మాత్రం దానికి ఐదింతలు ఫీజు పెంచడంపై పలువురు విమర్శలు  చేస్తున్నారు. మరోపక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజులో ఎలాంటి రాయితీ ఇవ్వకపోవడంపైనా మండిపడుతున్నారు.

అక్టోబర్ 21 దాకా దరఖాస్తుకు చాన్స్

ఈ నెల 17న టెట్ ఎగ్జామ్ ఉంది. 27వ తేదీన రిజల్ట్స్ ప్రకటించనున్నారు. టెట్​లో క్వాలిఫై అయినవాళ్లు అక్టోబర్ 21 దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారి ఒకరు చెప్పారు. ముందే అప్లై చేసుకుంటే దరఖాస్తులో టెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఫైనలియర్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు కూడా డీఎస్సీకి అప్లై చేసుకోవచ్చని, కానీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాటికి ఆ పరీక్షలు పాసై ఉండాలని సూచించారు.

గుట్టుగా నోటిఫికేషన్

5,089 పోస్టుల భర్తీకి ఈ నెల 6న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ, ఈ నెల 8న పేపర్ నోటిఫికేషన్ ద్వారా బయటకు వచ్చింది. ఐదేండ్ల నుంచి లక్షల మంది ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ను గుట్టుగా పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్లోనైనా పెట్టాలి. ఆ పని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన, ఇతర అధికారులు చేయలేదు.  నోటిఫికేషన్ ఇచ్చే రెండ్రోజుల ముందు చెప్పాల్సిన శుభవార్తను.. రెండ్రోజులు లేట్​గా ప్రకటించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ఇలా చేసినట్టు విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. 

ఎస్​ఏ పోస్టులకు స్పెషల్ బీఈడీ చేసినోళ్లు అర్హులే..

డీఎస్సీ–2023 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన గైడ్​లైన్స్ ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్​జీటీ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులే ఎలిజిబుల్ అని ప్రకటించారు. స్పెషల్ బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్ఏకు, స్పెషల్ డీఈడీ అభ్యర్థులు ఎస్​జీటీ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు బైలింగ్విల్​లో ఉంటాయని, ఇంగ్లిష్/తెలుగు, హిందీ/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్ లో ఉంటాయని తెలిపారు. లోకల్ కోటాలో 95% పోస్టులు, నాన్ లోకల్ కోటాలో ఐదుశాతం పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ సెలెక్షన్లు.. రాత పరీక్షకు 80% మార్కులను, టెట్ లో వచ్చిన మార్కులను 20%గా తీసుకొని మొత్తం మార్కులుగా లెక్కిస్తారు.